22, సెప్టెంబర్ 2013, ఆదివారం

మనం వొకటి కాగలం. కులాలు మాపుకోగలం ; అభివృద్ధి సాధించ గలం. పేదరికం పోగొట్ట గలం -మనల్ని విడదీయకుండా పరిపాలించే వాడికి వోటు వేయాలి . అంతే.


కేంద్ర ప్రభుత్వం వారు ఆహార సెక్యూరిటీ బిల్లు ను పాస్  చేశారు. 

66 ఏళ్ళ తరువాత, మన దేశంలో, చాలా మందికి సరైన ఆహారం కూడా లేదని వొప్పుకోవడమే యిది.  యిది ఎవరి వల్ల జరిగింది ? యిప్పుడు , ఉన్నట్టుండి , 2014 ఎలెక్షన్ల  ముందు , 66 ఏళ్ళుగా రాని  ఈ జ్ఞానోదయం ఎలా, ఎందుకు వచ్చింది .

66 ఏళ్ళ క్రిందట 1 రూపాయ కు వొక డాలర్  విలువ వుండేదట . యిప్పుడు , 66 ఏళ్ళ తరువాత, దాదాపు 66 రూపాయల కు  వొక డాలర్   గా మన రూపాయ విలువ పడి పోయింది.

ఎందుకిలా జరిగింది ? దీనికి ఎవరు కారణం ?  మీకు తెలీదా? నాకు తెలీదా ?

 దేశం లో మూడో భాగం లో నక్సలైట్ల ప్రభావం చాలా ఎక్కువగా వుందట . దీనికెవరు కారణం? మిగతా రెండు వంతుల భాగంలో మన నాయకుల లంచ గొండి  తనం, వారి దుశ్చర్యల ప్రభావాలు కనిపిస్తూనే వున్నాయి. రెండో దాని వలన మొదటిది వచ్చిందా - అన్నంత ఎక్కువ గా వుంది

సరే . ఎవరు కారణం అన్నది వొక ప్రక్క వుంచితే - జరిగిన తప్పు లలో ముఖ్యమైనవి ఏమిటి - అనేది చాలా  ముఖ్యమైన అంశం  కదా . 

మన దేశంలో - మనం, ఉత్పత్తిని పెంచడానికి చాలా తక్కువ ప్రాముఖ్యత  యిస్తూ వచ్చాము . మనకు సహజ వనరులు చాలా వున్నాయి. రూపాయ విలువ పెరగాలంటే - దేశంలో , ఉత్పత్తులు పెరగాలి.  వేరే మార్గమే లేదు .

కానీ, కేంద్రం గానీయండి , రాష్ట్రం కానీయండి - వున్న దాన్ని పంచడమే గానీ- పెరిగే జనాభా కంటే - ఎక్కువగా ఉత్పత్తులు పెరగాలని, పెంచాలని మనస్స్ఫూర్తిగా   ప్రయత్నించడం లేదు .  జనాభా తగ్గాలనీ ప్రయత్నించడం లేదు. 

అందువలన ,  జనాభా పెరుగుతూ వుంది . ఉత్పత్తులు పెరగడం ఎప్పుడో మానేశాయి.  రూపాయ విలువ పడిపోతూ వుంది. అభివృద్ధి అసలు లేదని కాదు . కానీ వచ్చిన అభివృద్ధి చాలా వరకు ప్రైవేట్ వ్యక్తిగత ప్రయత్నాల వలన వచ్చిందే .  అదీ,జనాభా పెరుగుదల వల్ల , వ్యర్థమై పోతూ వుంది. 

ప్రభుత్వాలు చెయ్య వలసిన పనులు అసలు చెయ్యడం లేదు .

కొన్ని ఉదాహరణలు -

1.  విద్యారంగంలో పిల్లలకు, ముఖ్యంగా - దేశ  భక్తీ, ఉన్నతమైన సామాజిక విలువలు అతి ముఖ్యం.  అటువంటి దేశ భక్తీ, వున్నత విలువలు - విద్య ద్వారా పిల్లలకు కలగడం లేదని - మనకూ తెలుసు. 16 ఏళ్ళ పిల్లలు , కళాశాలల్లో చదివే యవకులు  మానభంగాలకు, దోపిడీలకు, హత్యలకు పాల్పడడం రోజు రోజుకూ  ఎక్కువవుతోంది . ఉద్యోగాల్లో వున్న వారిలో - ఎంతో మంది, లంచ గొండులుగా వుండడం మనకు తెలుసు. యిది కూడా చెడిపోయిన విద్య ప్రభావమే. వొక్క విద్య యొక్క విలువల ప్రమాణాలు  పెంచితే  - మరో 15 సంవత్సరాలలో - జాతిని పూర్తిగా మార్చ గల, చేవ గల తరం వచ్చేస్తుంది. ఇప్పుడున్న ఎన్నో సమస్యలు గణనీయంగా - తగ్గిపోతాయి .  యిది ఎప్పుడు జరుగుతుంది ? పాలకులకు లేని విలువలు - వారు విద్యలో ప్రవేశ పెడతారా ? నాకు నమ్మకం లేదు .  మంచి విలువలున్న నాయకులొస్తే - విద్య లోని విలువల ప్రమాణాలు పెరగొచ్చు . నాకు తెలిసి -  భూ ఆక్రమణలలో కూడా - చాలామంది  నాయకుల హస్తమే వుంది -అది  ఏ రాష్ట్రమైనా కానియ్యండి.  వారిలో లేని విలువలు మరొకరికెలా వచ్చేటట్టు  చేస్తారు వారు?

2. జనాభా పెరుగుదల మన దేశంలో ఉన్నంత ఎక్కువగా చైనా లో కూడా లేదు. చైనా లో ప్రభుత్వం చాలా సంవత్సరాలుగా వొక కుటుంబానికి వొకే సంతానం అనే విధానం తీసుకు వచ్చారు . ఫలితంగా - చైనా , అమెరికా ఆర్ధిక ప్రమాణాలను దాటి వెల్లగల స్థితికి వచ్చేసింది. మనకంటే నాలుగింతలు పెద్ద దేశంలో - మనకంటే తక్కువ జనాభా రాగల సమయం వచ్చేసింది . అమెరికా అంత కంటే చాలా పెద్ద దేశం . అక్కడ - జనాభా మనకంటే చాలా తక్కువ.    వారంతా- అభివృద్ధి చెందడానికి  కారణాలు - (1) జనాభా సంఖ్య పెరుగుదల కంటే - చాలా, చాలా ఎక్కువగా వ్యవసాయ, పారిశ్రామిక, సేవా సంబంధ  ఉత్పత్తులు పెరిగాయి. (2) జనాభా లోని విలువల ప్రమాణాలు కూడా యిప్పుడూ బాగుంది . 

మన దేశం లో ,   మనం, ఈ రెండు విషయాల్లోనూ, క్రిందికి పడిపోతున్నాము . దేశ భక్తి మన దేశంలో చాలా, చాలా, తగ్గిపోతున్నదనే  నా విశ్యాసం ; ముఖ్యంగా మన నాయకుల్లో . చాలామందిలో వారికి వుండవలసినంత  దేశ భక్తి, సామాజిక విలువలు లేవనే నా ప్రగాఢ విశ్వాసం . ఎక్కడ చూసినా అసత్యాలే . ఎక్కడ చూసినా నమ్మక ద్రోహమే.  ఎక్కడ చూసినా లంచ గొండి తనమే. 

సరే . వారిని ఎన్నుకొనే ప్రజలలోనూ అవి గణనీయంగా తగ్గి పోయాయి . మంచి , నిస్స్వార్థ పరులైన నాయకులను ఎన్నుకుంటే - మళ్ళీ, దేశం త్వరగా బాగుపడుతుందని - నా ప్రగాఢ విశ్వాసం. 

దేశంలోని ఏ సమస్య చూసినా - ఎక్కడో వొక చోట నాయకత్వ లోపంగానే తేలుతుంది. 66 సంవత్సరాలు, దాదాపు వొకే పార్టీకి అధికారం కట్టబెడితే - రూపాయ విలువ పెరగాల్సింది పోయి 1/2 కు కాదు, 1/4 కు కాదు ; ఏకంగా 1/66 వ వంతుకు పడిపోయింది.  ఈ మధ్య కాలంలో - ఎన్నో దేశాలు మనలను దాటి ముందుకు వెళ్లి పోయాయి. 

కులాలు పూర్తిగా పోయి, మనమందరం వొకే కులం అనే స్థితి రాక పోగా, కులాల వారీగా పార్టీలు, బాంకులు, టీవీ  చానల్లు, సొసైటీలు - అన్నీ ఈ రోజు కుల ప్రాతిపదిక పైనే జరుగుతున్నాయి. బ్రిటిష్ వాడు - విడదీసి పాలించుమన్నా -అన్నాడని అనే వారు కానీ - ఆ పని చేసింది, చేస్తూ వున్నది మన పాలకులే అని తెలుస్తూనే వుంది . మనం వొకటి కావాలి. కాగలం.  మనల్ని విడదీయకుండా  పరిపాలించే  వాడికి వోటు వేయాలి . అంతే. 

ఎవరికీ కష్టం లేకుండా, సుఖంగా క్రమంగా కులాలు మాపుకోవచ్చు ; అభివృద్ధి సాధించ వచ్చు . పేదరికం పోగొట్ట వచ్చు . అంతే కాదు; మరే దేశంలోనూ , లేనంత సుఖ శాంతుల్ని మన దేశంలో నెల కొల్ప వచ్చు . 

యోచించండి మరి ! 

=మీ 

వుప్పలధడియం విజయమోహన్

8, సెప్టెంబర్ 2013, ఆదివారం

శ్రీ వినాయక చతుర్థి -2013 - శుభాకాంక్షలు



విజయనామ సంవత్సర, శ్రీ వినాయక చతుర్థి 


నాడు 


తెలుగు వారందిరికీ 


మీరు ఏ జిల్లాలో వున్నా, ఏ రాష్ట్రంలో వున్నా, ఏ దేశంలో వున్నా


మీకు వినాయకుడు


సకల ఆయురారోగ్య, సుఖ, శాంతులనూ, సకల ఐశ్వర్యాలనూ , శుభాలనూ 

 

ప్రసాదించాలని  కోరుతూ 

 

= మీ 

 

వుప్పలధడియం  విజయమోహన్



కలిసి వుంటేనే - కలదు సుఖం = నిస్వార్థ , సమర్థ, నాయకులను ఎన్నుకుంటేనే - మన అభివృద్ధి


 కలిసి వుంటేనే - కలదు సుఖం


మనం చెయ్య గలిగే పనులు ఎన్నో వున్నాయి.
మనం చెయ్య లేని వాటితో పోలిస్తే - చెయ్యగలిగేవి చాలా తక్కువ . నిజమే .
కాక పొతే ....  చెయ్య గలిగే పనులు సకాలంలో చెయ్యడం లోనే, మన సంతోషం , అభివృద్ధి -రెండూ వుంటాయి .
  •  పుట్టడం మనం చేసిన పని కాదు. మన వల్ల అయ్యే పని కూడా కాదు. ఎందుకు ఫలానా వారి కడుపున, ఫలానా , ఫలానా జాతి, కులాల్లో , ఫలానా రంగు,రూపు లతో, ఫలానా, ఫలానా జన్యు గత స్వభావాలతో, ఫలానా చోట - యిలా ఎలా  పుట్టామో మనకు తెలీదు. అది మన చేతిలో లేదు. మన తల్లిదండ్రుల చేతిలోనూ లేదు. 
  • కొంత మందికి ఎదుటి వాడి రంగు, కులం, మతం, పుట్టిన స్థలం, తేదీ కూడా నచ్చడం లేదు . నచ్చక పొతే పెద్ద బాధేం లేదు కానీ - మా వూరు విడిచి వెళ్ళిపో - అంటున్నారు. 
  • వొక సారి వొక పులి అందట - మేకా, నువ్వు త్రాగుతున్న ఎంగిలి నీరు నాకు వస్తోంది. నీ ఎంగిలి నీరు నేనెలా త్రాగను? కాబట్టి నిన్ను చంపి తినేస్తాను - అని. మేక అందట - నేను ఎంతో క్రింద వున్నాను, మీ ఎంగిలి నీరే నాకు వస్తోంది - కానీ నా ఎంగిలి నీరు మీకెలా వస్తుంది  అని! నువ్వు కాక పొతే, మీ నాన్న అయి వుంటాడు . ఏమైనా, నేను నిన్ను తినాల్సిందే -అని పులి అందట .  ఇలాంటి వాదనలకు - సమాధానాలు వుంటాయా? 
  • వెనకటికి వొకాయన - ఈ యింటి కాకి ఆ యింటిపై వాలకూడదని కోప్పడ్డాడు . కాకులేవీ ఆయన మాట వినలేదు . ఆఖరికి, కాకులేమో అన్ని ఇళ్ళపై వాలుతూనే వున్నాయి . ఆయన మాత్రం స్మశానంలో బూడిదై మాయమై పొయాడు.   ఇళ్ళూ వున్నాయి. కాకులూ వున్నాయి. వాలకూడదని చెప్పిన వాడు అన్నిటికీ దూరంగా,  బూడిద గానో, మట్టిగానో వున్నాడు. 
  • మనలో కొందరు -  యిటువంటి  వారి మాటలు విని - మేము వేరే, మీరు వేరే  అని కొట్లాడుకుంటున్నాము. పోతన వరంగల్ జిల్లాలో పుట్టాడు. శ్రీనాథుడు  కోస్తా ప్రాంతం వాడు. వారు బావా మరుదులు గా - యిద్దరూ గొప్ప కవులుగా వుండడం మనకు తెలీదా? ఎప్పుడు మనం వేరయ్యాము? అప్పట్లో రాయల సీమ, తెలంగాణా , కోస్తా అన్న   పేర్లే లేవు . అందరూ తెలుగు వారే . మరి, ఈ విభేదాలు ఎప్పుడు వచ్చాయి? ఇరాన్ నుండి, అరేబియా నుండి వచ్చిన తురుష్క ప్రభువుల నుండి వచ్చింది. వాళ్ళు గుళ్ళూ కొట్టారు. గోపురాలూ కొట్టారు.  మాతృదేవోభవ అనే మన సంస్కృతిని  కూడా కొట్టారు. వారు మధ్యలో వచ్చారు. మధ్యలో పొయ్యారు. 
  • యిప్పుడున్న తురుష్క రాజ సంతతి వారు కూడా తురుష్క దేశాలతో సంబంధాలు పెట్టుకుంటున్నారే తప్ప , తెలంగాణా వారితో కాదు ; కోస్తా వారితో కాదు. అసలు భారదేశ వాసులతోనే కాదు. వారికి లేని తీట మనకొచ్చింది.   మన దేశం తోనే పెద్దగా సంబంధాలు యిష్ట పడని  వారు పెట్టిన పేరు మనకు శాశ్వతం అనుకుంటున్నాము. 
  • అంతకు ముందు రాముడు తిరిగిన ప్రాంతం మనది. అది మనకు గుర్తు లేదు. విజయనగర రాజులు, వోరుగల్లు రాజులు మరెంతో మంది రాజులు రెండు ప్రాంతాలనూ చేర్చి పాలించ లేదా ? అదెందుకు  మనకు గుర్తు రాదు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత సర్దార్ పటేల్ గారు మళ్ళీ కలిపాడు మనల్ని. లేదంటే, మనలో వొక పాకిస్తాన్ పుట్టి  వుండేది. యిప్పుడు పాకిస్తాన్ లో ఎలాంటి పరిస్థితులు వున్నాయో మనం చూస్తూనే వున్నాం కదా.  అది మనకు కావాలా?  అందునా తెలుగు వాళ్లకు అది కావాలా?
  •  మొన్నొకాయన టీవీ చానల్ లోనే అన్నాడు - మేము ఇండియన్స్ కాము..కాము..కాము. భారత దేశం దురాక్రమణ చేసి మమ్మల్ని తనలో కలిపింది - ఇలా ఎన్నో అన్నాడు. ఇలాంటి వాళ్ళా మనకు నాయకులు?   వీరి మాటా మనం వినేది ? మనకు - కలిపిన వాళ్ళెవరూ గుర్తు రారెందుకు? విడదీసిన వాడు మాత్రం గుర్తున్నాడు. వాడేదో మనకు గొప్ప ఉపకారం చేసినట్టు! అతను కూడా - ఏదో వొక పేరు పెట్టాడు -వొక ప్రాంతానికి - అంటే కాని , మనం విడి పోవాలని ఎప్పుడూ చెప్పలా. మనం వేరే, వేరే - అని కూడా చెప్పలా.
  • పోతన్న, శ్రీనాథుడు బావ మరుదులైతే - మనం వేరే ఎలా అవుతాము. గోపన్న, పోతన్న, తిక్కన్న, వేమన అందరూ - మన వారు కాదా? ఎవడో వొక విదేశీయుడు కొన్నాళ్ళు రాజ్యమేలితే -మీరు వేరు, మేము వేరా - మనం మనం కామా ? ఇదెక్కడి పిచ్చి?
  • వొక్క పోతన, శ్రీనాథుడు మాత్రమే కాదు ,ఎంతో మంది తెలుగు వారు అన్ని ప్రాంతాలకూ వెళ్ళారు, వచ్చారు
  • మొదట మనకు కర్నూల్ రాజధాని అయ్యింది. రాజధాని అక్కడే వుండి  వుంటే - ఈ విభజనా గట్రా ఆలోచనలు వచ్చేవి కావేమో.  ఆ తరువాత హైదరాబాద్ రాజధాని అయ్యింది . తరువాత మన రాష్ట్రంలో అక్కడ మాత్రమే విపరీతమైన అభివృద్ధి తీసుకొచ్చారు. రాష్ట్రంలో మరే ప్రాంతంలోనూ  లేనంత అభివృద్ధి అక్కడే, మనమంతా  చేరి తీసుకు వచ్చాం. 
  • ఆ తరువాత -మద్రాసు నుండి సినిమా పరిశ్రమ అంతా - హైదరాబాద్ కే తరలి వచ్చింది. అప్పుడెవరూ - మీరు ఇక్కడికెందుకు వస్తున్నారు - మీ ప్రాంతానికి వెళ్ళండి - అన్న వాళ్ళు లేరు. రచయితలు, కళాకారులు, సైంటిస్టులు , పారిశ్రామికులు - అందరూ - రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి హైదరాబాద్ కు వచ్చారు. అప్పుడు కూడా మీరు ఇక్కడికెందుకు వస్తున్నారు - మీ ప్రాంతానికి వెళ్ళండి - అన్న వాళ్ళెవరూ లేరు. 
  • ఈ కాలంలో - భార్యాభర్తల మధ్య కూడా చాలా సులభంగా చిచ్చు పెట్టే వారున్నారు. అమ్మా, మీ వారిని ఏదో హోటల్లో చూసాను, మరో అమ్మాయితో కూర్చొని వున్నారు - అంటే చాలు. అన్న వాడు  తెలియనివాడైనా ఫరవాలేదు. ఆమె యింట్లో - ఆ రోజు రామ రావణ యుద్ధమే. 
  • అలాగే, మీ యింట్లో, మీ ఆవిడ ఎవరితోనో కూర్చొని మాట్లాడుతూ వుందండీ.. మరేమో .. అని చెప్పారనుకోండి. ఆయన యింట్లో మహా  భారత యుద్ధమే. పెళ్ళాం  పైన,మొగుడి పైన వున్న నమ్మకం కన్నా మనలో చాలా మందికి -  ముక్కు, మొహం తెలియని వాళ్ళు చెప్పే పితూరిలపై వుంటుంది. యిది మనకున్న పెద్ద బలహీనత . 
  •  మరి ప్రజల మధ్య చిచ్చు పెట్టడం వొక లెక్కా? అది ఎంతో సులభం గా మారి పోయింది . అదో, వారి వలన "మనం" నష్టపోయాం - అంటే చాలు. అనుమానాలు, విరోధాలు వెంటనే వచ్చేస్తాయి . మంచి నాయకుడు లేకపోతే - యింకా త్వరగా వచ్చేస్తాయి . సరే ; అయ్యా - మీరేమీ నష్ట పోలేదు -యిదుగో, గణాంకాలు - మీరే చూడండి అంటే - ఈ  గణాంకాలు - చేసిన వాడేదో కుట్ర చేసాడు - మీతో కలిసి . మేము నమ్మం గాక నమ్మం. మరి దీనికి జవాబు ఎక్కడ తెస్తాం . మరో సారి గణాంకాలు తెమ్మందాం -అంటే; వొద్దు; మొత్తానికి, మీకూ, మాకూ పొత్తు కుదరదు -అని రిప్లై . అసలు, ఏ తర్కానికీ లొంగని ఈ తర్కం ప్రకారం రాష్ట్ర ప్రజలు  విడపోదామంటే - ఎంత అవాంఛనీయం 
  • అయితే - పాలక వర్గంలో - కొన్ని రకాల అవాంచనీయ పరిస్థితులు  వచ్చాయనే చెప్పుకొవాలి. మా కులం, మాకులం అన్న పక్షపాతాలు ఎక్కువయ్యాయి. మన రాష్ట్రాభివృద్ధి, పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే కూడా  చాలా, చాలా, కుంటు పడిందనే చెప్పుకొవాలి. యిది అన్ని ప్రాంతాలకూ చెందినదే.  కానీ, యిది మనం ఎన్నుకున్న నాయకత్వ లోపమే. చూడబోతే - మంత్రివర్గంలో - అన్ని ప్రాంతాల నాయకులూ - ఎప్పుడూ వున్నారు . ఏ ప్రాంతం అభివృద్ధి చెందక పోయినా - ఆ ప్రాంతపు  నాయకులే కారణం -మరెవరో కాదు .
  • నిజానికి -  మనకున్న  వనరులకు - మనం, గుజరాత్ కంటే కూడా బాగా అభివృద్ధి చెందవచ్చు . కానీ చెంద లేదు. గోదావరి, కృష్ణ  నదుల నీళ్ళు  ప్రతి జిల్లా కూ  ఎందుకు అందటం లేదు - ఈ రోజు వరకూ ? ఆదిలాబాద్ నుండి , చిత్తూర్  జిల్లా వరకు  కాలువలు త్రవ్వి త్రాగు నీరు, పంట నీరు రెండూ, కల్పించి  వుండ వచ్చు. కావాల్సినంత విద్యుత్తు  ఉత్పాదన చేసి వుండ వచ్చు.  ఎన్నో రకాలుగా,ఉద్యోగ, వృత్తి అవకాశాలు కల్పించి వుండ వచ్చు . యిప్పుడు చేస్తే కూడా - వచ్చే 5 సంవత్సరాలలో - యివన్నీ చెయ్య వచ్చు . 
  • యిప్పుడు  వస్తున్న ఉద్యమాలు కూడా - ఈ పరిస్థితికి ప్రతికూలంగా  వచ్చినవా - అన్న అనుమానం వుంది .
  • ఏది ఏమైనా , మనమంతా కలిసి పనిచేస్తేనే , కులాలకతీతంగా,  మంచి నాయకులను ఎన్నుకుంటేనే - మనం బాగుపడతాం .
  • నా ఉద్దేశంలో - కలిసి వుంటేనే - కలదు సుఖం. అలాగే, నిస్వార్థ , సమర్థ, నాయకులను ఎన్నుకుంటేనే -  మన అభివృద్ధి .అలా ఎన్నుకోలేక పోతే  ఏ అభివృద్ధీ వుండ బోదు. 
  •  వెనకటికి , వొక సామెత చెప్పే వారు - తొందర పడి , తాతాచార్యులు, మతం మార్చుకున్నాడట . ఆ తరువాత, ఆ మతం లోని నియమాలు, సమస్యలు  తెలిసిన వెంటనే, మళ్ళీ మొదటికొచ్చేసాడట.
  • మరో సామెత - ఏదో చెయ్యబోతే , పెద్ద ముక్కు రాలేదు కానీ ; వున్న ముక్కు ఊడి పోయిందట  
  • అలా అయిపోతుంది పరిస్థితి .  ప్రజలంతా యోచన చెయ్యాలి. 
  • సర్వే జనాః సుఖినోభవంతు
  • =మీ 
  • వుప్పలధడియం  విజయమోహన్   

6, సెప్టెంబర్ 2013, శుక్రవారం

(1) అత్తలు-కోడళ్ళు- ఎద్దు ఈనింది, అంటే, గాట్లో కట్టేయండి -అన్న తరహాచట్టాలు;(2) సమైక్యాంధ్ర ఎందుకు ?

కలిసి వుంటే కలదు సుఖం - ఎప్పటి సినిమా? ఎన్నో దశాబ్దాలకు ముందు వచ్చింది. కుటుంబాలకు సంబంధించిన  కథ. అప్పట్లో అందరూ ఆ సినిమాను మెచ్చుకున్నారు. చాలా మందికి అప్పట్లో చాలా  నచ్చింది.  ఎందుకా సినిమా తీయాల్సి వచ్చింది ?  చాలా మంది  మనస్సులో, విడిపోతే బాగుండునేమో - అన్న భావనలు వుండడం వల్ల వచ్చింది . 

ఆ తరువాత - మన మానసిక దృక్పథం చాలా చాలా మారిపోయింది. విడిపోతే కలదు సుఖం - అనే  బాటలోనే యిప్పుడు చాలా మంది పయనిస్తున్నారు.  అందుకు ఎన్నో కారణాలు.  

కోడలు చెడ్డది అని పొరుగింటావిడ చెబితే  అత్త నమ్మేస్తుంది.  అత్తలందరూ చెడ్డ వాళ్లే - అంటే  నమ్మేస్తారు కోడళ్లు.   మనం చేసుకునే   చట్టాలూ అలాగే  ఏడిచాయి.  కోడలు చెబితే , నిజమో కాదో తెలుసుకోకుండా -అత్తారింటోళ్ల నందరినీ  జైల్లో  వేసేయమని  చట్టం. అత్తా వొక నాటి కోడలే ; కోడలూ వొక రోజు అత్తే -అన్న ప్రాథమిక  సత్యం అర్థం గాని వాళ్ళు చేసే చట్టాలు యిలాగే  ఏడుస్తాయి. అందరినీ జైల్లో వేయమని  చెప్పే కోడలు - మళ్ళీ ఆ యింట్లో  ఎలా వుండగలదు ? మొగుడితో ఎలా కాపురం చెయ్యగలదు ? ఈమె చెయ్యాలన్నా వాళ్ళు మళ్ళీ వొప్పుకుంటారా ?   వొకటిగా వుండగలరా? 

మనకు సంసారాలు  నాశనం చేసే  చట్టాలు కావాలా? సంసారాలు  సరి దిద్దే  చట్టాలు కావాలా?   కావాలంటే - సంసారాలు సరిదిద్దే చట్టాలు చాలా సులభంగా చెయ్యవచ్చు. 1955 లో చేసిన చట్టాలు సంసారాలు చక్కదిద్దే రీతిలో వున్నాయి. విడాకులు కావాలని వచ్చే వారికి- నచ్చ జెప్పి సరి చేసే ప్రక్రియ ఆ చట్టాల్లో వుంది. అప్పటికీ సరికాక పోతే విడాకులు యివ్వడం తప్పని సరి అన్నప్పుడు - యిచ్చేవారు. అప్పటి ఆ చట్టాల్లో వున్న విజ్ఞత- ఆ తరువాత వచ్చే చట్టాల్లో అస్సలు లేదు. 

కోడలు ఏది చెబితే - అదే నిజం అనుకునే వ్యవస్థ  వచ్చింది . కొన్ని చోట్ల నిజమే కావచ్చు . కొన్ని చోట్ల అబద్ధమూ  కావచ్చు . అన్ని చోట్లా కోడలు చెప్పేదే నిజం కానక్కర లేదు.  ఏది ఏమైనా -ఎవరిది తప్పు అన్నది కనీసం విచారించ కుండా అత్తగారి కుటుంబాన్నంతా జైల్లో తోసేయ్యడం అమానుషం. అటువంటి  చట్టాలు ఎన్నో కుటుంబాలను బాధించడం నాకే తెలుసు - మీకూ తెలిసి వుంటుంది . ఎవరి తప్పైనా - నచ్చ జెప్పడం , కౌన్సెలింగ్ , అంతకు మించితే చట్ట పూర్వకంగా కాస్త బెదిరించడం, సాంఘికంగా వొత్తిడి తీసుకు  రావడం  లాంటి ఎన్నో పద్దతులు వుపయోగించి సంసారం సరి చెయ్యాలి ; చెయ్య వచ్చు . 

అవేవీ చెయ్యకుండా - ఎద్దు ఈనింది, అంటే,  గాట్లో కట్టేయండి -అన్న తరహా చట్టాలు చేస్తూ పోతే సమాజం కుళ్ళి పోతుంది ; నాశనమై పోతుంది . చాలా చోట్ల కోడలికీ అన్యాయం జరుగుతూ వుంది .అలాగే కోడలు రాక్షసిగా, అత్త అస్సలు నోరు లేని దానిగా వుండే కుటుంబాలూ వున్నాయి. 

కాస్తో,కూస్తో సర్దుబాటు మనస్తత్వం లేని వారు ఎన్నో చోట్ల యిరు వైపులా వున్నారు.  అది సరి చేసి - కోడలు, అత్తారింట్లో , మొగుడితో సుఖంగా వుండేటట్టు  చూసే పద్ధతులు ఈ చట్టాల్లో లేనే లేవు. మొగుడినీ, అతడి కుటుంబం వారందిరినీ జైల్లో వేసే వొకే వొక పధ్ధతి వుంది.  కోడలినీ,  ఆమె మొగుడినీ, బద్ధ  విరోధులుగా చేసి, వారిరువురి జీవితాలూ పూర్తిగా నాశనం చేసి , ఆ మొగుడిని కన్నందుకు , అతని తల్లి తండ్రులు , వారి యింటిల్లి  పాదీ జైల్లో వుండాల్సిన పరిస్థితి  యిప్పటి  చట్టాల్లో వుంది.

కళ్ళు చూసేదీ, చెవులు వినేదీ మాత్రం నమ్మి  ఏ పనీ చెయ్యొద్దు. బాగా విచారించి, నిజమేమిటో  తెలుసుకుని మరీ చెయ్యి అన్న సామెత చాలా భాషల్లో - చాలా శతాబ్దాలుగా, వేల సంవత్సరాలుగా  వుంది.  

అయినా, యిప్పుడు చట్టాలు, పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ అన్నీ - ఈ ప్రాథమిక సూత్రం విస్మరిస్తున్నాయి. నిజం ఏమిటి? నిజం ఏమిటి ? అన్న విషయం మనం, మన సమాజం ఎప్పుడూ దృష్టిలో పెట్టుకోవాలి. ఎవడో చెప్పింది గుడ్డిగా నమ్మ కూడదు. దానిపై ఆధార పడి చట్టాలు  చెయ్యడం, స్నేహాలు , బాంధవ్యాలు నేల రాచేయ్యడం చాలా తప్పు.

మన మానసిక అంధత్వానికి  మరో ఉదాహరణ - యిప్పుడు జరుగుతున్న రాష్ట్ర విభజన కార్యక్రమం. నేను ఈ సమస్య యిప్పటి   వరకూ ఎక్కువ పట్టించు కోలేదు. కానీ, కొందరు రాజకీయ వాదుల పోకడ గమనిస్తే, వారి వలన రాష్ట్రానికే కాదు ; మున్ముందు దేశానికే ప్రమాదం రావచ్చు - అనిపించిది . అందుకనే, యిది రాయాలనిపించింది. రాష్ట్ర ప్రజలంతా, ముఖ్యంగా, తెలంగాణా ప్రాంతం వారు,  ఈ విషయాలు బాగా ఆలోచించాల్సిన  అవసరం వుంది. 

తెలుగు వాళ్ళంతా వొక  రాష్ట్రం గా వుండడం కుదరదు - అని   కొంత మంది రాజకీయ నాయకులు తెలంగాణా  ఉద్యమం లేవదీశారు. ఎందుకు - అంటే  మాకు అన్యాయం జరిగి పోతోంది;  మాకు  ఎప్పుడూ అన్యాయమే జరిగింది - అంటూ ఆవేశంగా మాట్లాడి  ప్రజలలో కూడా - ఆవేశం రగిలించారు.

సరే .  ఎద్దు ఈనింది -అంటే , గాట్లో కట్టేయండి -అన్న తరహా మనది. మనకు నిజంగా అన్యాయమే -జరిగింది కాబోలు - అని కొంత మందిలో వొక ఉద్దేశం సహజంగా వచ్చింది . అందుకే  శ్రీకృష్ణ  కమిటీ  వేశారు. కమిటీ వారు - తెలంగాణా  ప్రాంతానికి న్యాయమే జరిగింది. కాస్త ఎక్కువ న్యాయమే జరిగిందన్నారు. అసలు ఈ కమిటీ  రిపోర్ట్ మేం వోప్పుకోం అన్నారు - ఈ రాజకీయ వాదులు.

అప్పుడేం చెయ్యాలి? నన్నడిగితే, వో 2-3 వివిధ రాష్ట్రాల జడ్జీలు, ఆర్ధిక శాస్త్ర వేత్తలు వున్న మరో కమిటీ మళ్ళీ వేసిండొచ్చు . వారెలా చెబితే అలా చేసిండొచ్చు . నిజంగా అన్యాయం జరిగి వుంటే - న్యాయం ఎలా చెయ్యాలో ఆ కమిటీ చెబుతుంది  కదా .  అలా జరుగ లేదు. ఆ తరువాత  ఎంతో మంది  స్టాటిస్టిక్స్  యిచ్చారు - తెలంగాణాకు  న్యాయమే జరిగిందని .

కానీ, మాకీ స్టాటిస్టిక్స్ వద్దు. మీరు వద్దు; అంతే.  మీరు వెళ్లి పొండి -అని నీచంగా మాట్లాడే వాళ్ళ వద్ద  ఏ  తర్క మూ పని చెయ్యదు. నిజమేమిటి - అన్నది మాకనవసరం ; మేం విడి పోతం - అంతే అన్నది కొత్త వాదన .

కొన్ని ఏళ్ళ క్రితం, కొంత మంది రాజకీయ వాదులు - పని గట్టుకుని కొంత మంది ఉద్యోగుల యిళ్ళకు వెళ్లి , మీరు, మీ ప్రాంతాలకు  వెళ్లి పొండి అని చెప్పడం  వార్తా పత్రికల్లో వచ్చింది. వారు వుద్యోగులు . మూటా, ముల్లె సర్దుకుని ఎలా వెళ్ళిపోతారు ? యిది ఎంత అమానుష కార్యమో  - అలా అడిగిన వారికి అప్పటికీ, యిప్పటికీ  అర్థం కావడం లేదు. పైగా, పత్రికల వారు అడిగితే  - మేము వాళ్ళను కొట్టామా? తిట్టామా? వెళ్ళి పొమ్మన్నాము, అంతేగా - అన్నారు. యిలా రాజ్యంగా విరుద్ధంగా,  చట్ట విరుద్ధంగా ప్రవర్తించే వారిపై ఏ చర్యా లేకపోతే , వారి చర్యలు మరీ యెక్కువవుతాయి. అలాగే అయ్యింది.

ఈ మధ్య వొక T.V. చానెల్  లో, వొక తెలంగాణా రాజకీయ నాయకుడి అభిప్రాయాలు  విన్నాను. అవి మరీ ఘోరంగా వున్నాయి.

ఆయనంటారు - యిదొక ప్రత్యేక దేశంగా వున్న ప్రాంతం ..వుయ్ ఆర్ నాట్ ఇండియన్స్, వుయ్ ఆర్ నాట్ ఇండియన్స్.. వుయ్ ఆర్ నాట్ ఇండియన్స్..   దురాక్రమణ చేసి ఆక్రమించుకుంది భారత దేశం ..

యిది ఎంతో మంది వినే వుంటారు. నేను ఫేస్ బుక్  లో చూసాను. విన్నాను. యిందుకా   తెలంగాణా ? ఈయనకు నిజాం పాలన కూడా ఓకే .  హైదరాబాద్ ను పాకిస్తాన్ లో చేర్చాలని చూసిన వారు కూడా పరవాలేదు కానీ భారత దేశ పాలన, సర్దార్ పటేల్ గారి కృషి ఓకే  కాదు?
సర్దార్ పటేల్ గారి కృషినంతా వెనక్కు తిప్ప గలిగే రాజకీయ భావాలు ఈ కొంత మంది రాజకీయ వాదులలో వున్నాయని - భారత దేశం లోని అందరూ గ్రహించాలి. భారత దేశపు సమైక్యతను దెబ్బ తీయ గలిగే  భావాలు కావా యివి? రాష్ట్ర సమైక్యత వొక ప్రక్క వుండ నీయండి .

చంద్ర శేఖర రావు గారు సరే సరి. ఆయన నోటి వెంట ఎప్పుడు ఎవరిపై ఏ తిట్లు వస్తాయో - బ్రహ్మ దేవుడికి కూడా తెలీదు. ఆయన ఎప్పుడు ఎవరిని ఎలా వెళ్లి పొమ్మంటాడో - ఎవరూ చెప్ప లేరు. తెలంగాణా ప్రజలకు నిజంగా యిటువంటి  రాజకీయ నాయకుల పాలన కావాలా? వీరు, మొదట ఆంధ్ర, రాయలసీమ ప్రజలకు ఎలా అన్యాయం చెయ్యాలో అదే యోచిస్తారు. అవి చేస్తారు.  యిదే అందరి భయం. నమ్మకం. అందుకే యింత పెద్ద ఎత్తున  సమైక్య ఆంధ్ర ప్రాంత పోరాటం జరుగుతూ వున్నట్టు తెలుస్తూ వుంది. 

మున్ముందు ఢిల్లీ  పాలకులు ఏం చేస్తారో   నాకు తెలీదు కానీ -  ఏది చెయ్యాలన్నా - చాలా, చాలా ఆలోచించి  చెయ్యాలి . లేదంటే - తెలుగు వారికి మాత్రమే  కాదు. యావద్దేశానికీ  ఏదో ప్రమాదం మున్ముందు  వచ్చే  సూచనలు మాత్రం వున్నాయి.

అయితే అక్బరుద్దీన్ ఒవాయిసి - లాంటి వారినే -మన చట్టాలు ఏమీ చెయ్య లేదు . ఆయన ఏమేం మాట్లాడాడో, వొక్క సారి వికీ పెడియా లో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అసలు మన దేశంలో చట్టాలేమీ లేవా - అనిపిస్తుంది.  ఆయనా  యిక్కడే వున్నాడు . మరి తెలంగాణా వస్తే - యింకా ఏమేం మాట్లాడుతాడో, ఏమేమి చేస్తాడో?


యిది  ప్రజలు ముఖ్యంగా గ్రహించాలి . మీరు వొక్క సారి ఈ తరహా రాజకీయ వాదుల  వద్ద చిక్కుకుంటే , మళ్ళీ, వేసిన తప్పటడుగు వెనక్కు తీసుకునే అవకాశమే లేదు .

ఈ  విషయంలోనే,కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా , మరింత శ్రద్ధ చొరవ తీసుకోవాలి . ఆయన పై చెప్పిన రాజకీయ నాయకుల స్వభావాలు , వాటి వల్ల , దేశానికి వచ్చే ప్రమాదం, తేట తెల్లంగా కేంద్రానికి చెప్పాలి.  యివి దేశానికంతా కూడా తెలియాలి . అలాగే, మిగతా నాయకులు , ముఖ్యంగా చంద్రబాబు గారు కూడా యివన్నీ పరిశీలించి కేంద్రానికి స్పష్టంగా, చెప్పాలి.

రాజకీయ నాయకులు మంచి వారైతే, మానవతా వాదులైతే , రాష్ట్ర  విభజన ,యివన్నీ పెద్ద విషయం కాదు. కానీ, యిక్కడ, అదే లోపించింది. అందరూ అని కాదు. కొంత మంది ముఖ్యమైన వారు, మహాదురుసుగా మాట్లాడుతున్న వారు పదవికెక్క గలవారు దేశానికి ప్రమాదం తెచ్చి పెట్ట గల వారే - అన్న విషయంలో నాకైతే సందేహం లేదు. 

దేవుడా - అందరి మనస్సులో, అందరి పట్లా , సుహృద్భావం నింపు . లేదంటే - ఆట కదరా శివా , ఆట కదా కేశవా - అని కేదార్నాథ్  ప్రమాదం ను గురించి పాడినట్టు పాడుకోవాల్సి వస్తుంది .

=మీ

వుప్పలధడియం విజయమోహన్