21, నవంబర్ 2011, సోమవారం

SEVALAYA =ఎందరో మహానుభావులు = సేవాలయ = బాలల, వృద్ధుల ఆశ్రమం = మనమేం చెయ్యగలం ?


క్రిందటి వ్యాసంలో - చెయ్యగలిగిన మంచి పనిని వెంటనే చేసెయ్యాలని అనుకున్నాం.

అందులో వొక భాగంగానే - పదిహేడు సంవత్సరాల క్రితం దక్షిణ రైల్వే  పోలీసు వారు -వొక స్త్రీ వేధింపు చర్య ఘటనల పైన చాలా బాగా వ్యవహరించిన తీరును గురించి రాయడం జరిగింది. అలాంటి మంచి పనులు అక్కడక్కడా జరుగుతూనే వున్నాయి. అయితే - వారికి మన లాంటి వారు సరైన సమయానికి సరైన రిపోర్టు యిస్తే బాగుంటుంది. అలాగే - పోలీసు వారు కూడా - రిపోర్టు యిచ్చే వారిని వేధించకుండా, వారికి సరి అయిన రక్షణ కల్పిస్తూ వుంటే,  పౌరులు-పోలీసుల మధ్య మరింత సహకారం పెరుగుతుంది .

సరే. ప్రాచీన కాలంలో - స్త్రీ, బాల, వృద్ధులు సంతోషంగా వుండే సమాజమే - ఆదర్శ వంతమైన సమాజమని చెప్పారు.

వయసులో వున్న వారు - స్త్రీ, బాల, వృద్ధులను  సంతోషంగా  ఉంచుకోవడానికి - చాలా ప్రయత్నాలు చేసే వారు. పురాణాలు, ఇతిహాసాలలో - వున్న వృత్తాంతాలన్నీ ఇలాంటివే.  క్రిందటి వ్యాసంలో కొంత స్త్రీ వేధింపు చర్యల గురించి మాట్లాడాము.

మిగతావి వచ్చే వ్యాసాలలో చూద్దాము. ఈ వ్యాసంలో -  మరో చిన్న సంఘటన. నవంబర్ పదిహేడో తేదీ - మా దంపతులు వివాహం జరిగి  ముప్ఫై మూడు వసంతాలు ఆనందంగా గడిపిన సందర్భంగా, మా ఊళ్లోనే వున్న - "సేవాలయ" -అనే  అనాథ బాలుర, వృద్ధుల ఆశ్రమానికి వెళ్ళాము.

 యిది రెండో సారి, అక్కడికి మేము వెళ్ళడము.

మొదటి సారి లాగే- ఈ సారీ వొక్క రోజు పూర్తి ఖర్చులు మేము యిచ్చేసాము. కాని, అది జరిపే  వారి చిత్త శుద్ధి, కార్య శుద్ధి   ముందు - మనం చేసే  ధన సహాయం అసలు ఏమీ లేదు. యిప్పటికి దాదాపు 200 మంది వృద్ధులు, 200  మంది తల్లీ,. తండ్రీ లేని విద్యార్థులు - ఆ ఆశ్రమం లో వుంటున్నారు. ఆ విద్యార్థులతో బాటుగా-  మరో 800  మంది బీద విద్యార్థులు  కూడా   ప్రక్క గ్రామాల నుండి వచ్చిఅక్కడ పాట్హ శాలలో చదువుకుంటున్నారు.అందుకనే - సేవాలయా వారికి చాలా మంది సహాయం చేస్తున్నారు. 

అంతకు మించి మనం ఏమిచేయ గలమా -అన్నదే, మనం ఆలోచించ వలసిన విషయం.

తిరిగి వస్తూవుంటే - ఆ కాంపౌండు లోనే - వొక చిన్న పిల్ల మమ్మల్ని చూసి చిరునవ్వుతో   -  చెయ్యి ఊపింది. చాలా ముచ్చటగా వుంది. నేనే  అడిగాను - నీ పేరేమి, ఎన్నో క్లాసు చదువుతున్నావు అని . చెప్పింది. పేరు కృత్తిక. క్లాసు 6  - బీ సెక్షను.

బాగా చదవాలి. మళ్ళీ మేం వస్తాము. వచ్చినప్పుడు నిన్ను తప్పకుండా వెతుక్కుంటూ వచ్చి చూస్తాము - అన్నాము. ఆ పిల్ల సంతోషంగా -సరే, అంది. చూట్టానికీ ముచ్చటగా వుంది. దేవుడి దయ వుంటే - (వుండాలి)- బాగా వృద్ధిలోకి రాగల పిల్ల. కానీ తల్లీ, తండ్రీ లేరు.ఇలాంటి వారిని చూసినప్పుడు - మనమెందుకు, దాదాపుగా, చేయ గలిగే మంచి పనులు, ఏవీ  చేయడం లేదు - అనిపిస్తుంది.

దేశంలో, అనాథలంటూ - ఎవరూ వుండకూడదు. ప్రతి వొక్కరికీ -  నీకు సహాయం నేనున్నాను,  అని చెప్పే ఏదో వొక సహృదయుడు (రాలు)  తోడు వుండాలి. ప్రతి బాలుడు, బాలిక మొహంలో సంతోషం వుండాలి. అది చెరిగిపోనివ్వకూడదు మనం. ఆ సంతోషం మనం చూడాలి.

అప్పుడే - వారు, మంచి పౌరులుగా పెరగ గలరు.

అంటే - మనం చెయ్య గలిగిన మంచి పనులు - యింకా ఎన్నో వున్నాయి చెయ్యడానికి. రోజూ చెయ్య గలిగినవి, వారం, వారం చెయ్య గలిగినవి. నెలా,నెలా చెయ్య గలిగినవి -  కనీసం ప్రతి నెలా , ఏదో, మంచి పని చెయ్యాలి.

ఎందరో ఎంతో మంది మహానుభావులు ఎన్నో గొప్ప పనులు చేస్తున్నారు కూడా. వారికి - చేయూత నివ్వడం కూడా చేయాలి.

యిది వృద్ధుల ఆశ్రమం

బాలల క్లాసు రూము.
వీరి వెబ్ సైటు = సేవాలయ.ఆర్గ్ ; అందులో మీరు వారి పూర్తి వివరాలు చూడొచ్చు. యిప్పుడు యింకా బాగా - ఎన్నో చేస్తున్నారు.

వీరి లాగా - మంచి పనులు - త్వరగా చెయ్యాలనుకునే వారిని - చేసే వారిని తలుచుకుంటే - ఆనందంగా వుంది కదా .

=మీ 

వుప్పలధడియం విజయమోహన్

19, నవంబర్ 2011, శనివారం

చెయ్య గలిగిన మంచి పని = యిప్పుడే చేసెయ్యండి. = స్త్రీ వేధింపు చర్యలు = లంచగొండితనం =మనమేం చెయ్యగలం ? = దేశ / రాష్ట్ర మహిళా కమిషన్ ఎం చెయ్యాలి?


మనిషికి చాలా, చాలా సంతోషాన్నిచ్చే పనులు - మనం నిస్స్వార్థంగా, మరొకరి కొరకు చేసే పనులే అని చెప్పుకోవచ్చు. అవి  చిన్నవే  కావచ్చు. కాస్త  పెద్దవీ  కావచ్చు. కొన్ని సందర్భాల్లో - మహా గొప్ప పనులూ కావచ్చు.  ఏదైనా - మనం నిస్స్వార్థంగా చేసే పనులు మనకు జీవితాంతం  సంతోషాన్నిస్తాయనడంలో  నాకు సందేహం లేదు.  

అవి యితరులకు చెప్పుకోవచ్చా - చెప్పుకోకూడదా?  మన యిష్టం. చేసిన పుణ్యం చెబితే పోతుందని వొక సామెత. సరే. పుణ్యం పోతే పోనీ. మనసుకు ఏదో వొక సంతోషం - అనుకుంటే- చెప్పొచ్చు.   చెబితే - మిగతా వారు కూడా అలాంటివి చేస్తారనుకుంటే   - తప్పకుండా చెప్పొచ్చు.

శ్రీ రామానుజాచార్యుల వారికి - వారి గురువు , చాలా రహస్యం, మరెవరికీ తెలియరాదు -అని నారాయణ మంత్రం ఉపదేశించారు. వెంటనే -  రామానుజాచార్యులు గుడిపైకెక్కి అందరినీ పిలిచి - అందరికీ ఆ మంత్రాన్ని చెప్పారు. అది మంచా కాదా -అన్నది వివాదాస్పదమే. కొందరికి చాలా గొప్ప పని అనిపిస్తుంది.  కొందరికి - మంత్రోపదేశం అలా చేయడం చాలా తప్పు అనిపిస్తుంది.

ఇలాగా - వొక్కొక్క సందర్భం లోనూ - వొక్కొక్కరికి వొక్కొక్క  రకంగా అనిపించడం చాలా సహజం.

అయితే - నిశ్చయంగా, యిది మంచి పనే అనిపించిన దాన్ని - మనం  వెంటనే చేసేస్తే మంచిది. 

వొకాయన అంటారు - మీరు చేయలేని పని చేయక పోతే మునిగి పోయిందేమీ లేదు. కాని, చేయ గలిగిన మంచి పని చేయక పోతే - జన్మ వ్యర్థం అయిపోతుంది.

నిజమే. మనం చేయగలిగిన మంచి పనులు చేస్తూ పోవాలి.

తెలుగులో వొక సామెత వుంది. మేసే గాడిదను - కూసే గాడిద వచ్చి చెడిపిందట. అలాగా, మంచి పని చేయాలనుకునే వాడిని - చేయని వాళ్ళు వచ్చి చెయ్య నివ్వకుండా ఆపుతుంటారు . చేసే వాళ్ళకు విమర్శల వర్షం తట్టుకునే  శక్తి కూడా వుండాలి. అదీ విషయం.

మనమంతా - చిన్న చిన్న - తప్పులు చేస్తూనే వుంటాము. అలాగని - మంచి పనులు చేయ కూడదని నియమమేమీ లేదు. చిన్న తప్పులు చేసిన వాళ్ళు - పెద్ద మంచి పనులు తాము చేయడమో, చేసే వాళ్లకు తోడు పడడమో - చేయకూడదని రూలేమీ లేదు. కానీ  - ఏమీ చేయని వాళ్ళు - చేసే వాళ్ళను - చిన్న తప్పులు చూపించి పరిహాసం చేస్తూ వుంటారు. విమర్శిస్తూ వుంటారు.   

యిప్పుడు దేశం స్థితి అలాగే వుంది. టీం అన్నా లోని ప్రతి సభ్యుల పైనా - ఏదో చిన్న తప్పు రుద్దడమూ - వీరా లంచా గొండి తనం పైన యుద్ధం చేసే వారు - అని విమర్శించడం జరుగుతోంది.  నా ఉద్దేశంలో -ఎవరైనా ఈ యుద్ధంలో చేరవచ్చు. యిప్పుడు మీరు లంచం తీసుకుంటూ వున్నా సరే - ఈ పధ్ధతి పోవాలి అనుకుంటే - అందరూ చేరండి.విమర్శలు చేసే వారు - మారే వారిని కూడా మారనివ్వరు. విమర్శకుల మాట వింటే - దేశం యిలాగే ఎప్పుడూ లంచగొండి దేశం గా వుండి పోతుంది. నా అభ్యర్ధన - అందరూ - ఈ యుద్ధంలో చేరండి. మనమూ- నూరు శాతం ప్రజలు - ఆర్ధిక ఉన్నతికి నోచుకోవాలి. లంచమనే పదం కూడా దేశం నుండీ వెళ్లి పోవాలి.

దేశాన్ని పీడిస్తున్న మరో మహా మారి - స్త్రీలపై వేధింపులు. ఆంగ్లంలో ఈవ్ టీజింగ్ అంటారు కదా. అదన్న మాట. కత్తితో దాడి చేయడం, ఆసిడ్ పోయడం - బస్సుల్లో, రైళ్ళలో వేధించడము   - యివన్నీ ఎక్కువవుతున్నాయి. కొన్ని నగరాల్లో మరీ ఎక్కువ.

చెన్నై నగరంలో - యిది పదిహేడేళ్ళ క్రితం జరిగిన సంగతి.

నేను నగరం మధ్య నుండి మారి - నగర శివార్లలో,  స్వంత ఇల్లు కట్టడానికి ఆరంభించిన రోజులు.  క్రొత్త వూరి నుండి ట్రెయిన్ లో దాదాపు ముప్ఫై కి.మీ. దూరం వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు తెలిసింది - చెన్నై దగ్గర కూడా - స్త్రీలపై వేధింపులు ఎంత ఘోరంగా వుంటుందో.

 సెకండు క్లాసులో వెళ్ళిన రోజు -ప్రతి రోజూ ఇలాంటి వేధింపు చర్యలు చూడవలసి వచ్చింది. సెకండు క్లాసులోనే వొక చిన్న భాగంలో - స్త్రీల భాగం వుండేది. ఈ రెండింటికీ మధ్య  తలుపు లేని వొక ద్వారం వుండేది. చాలా మంది కాలేజీ విద్యార్థులూ, కార్మికులూ - ఆ ద్వారం వద్ద నిలబడి - లోనున్న ప్రతి స్త్రీ పైనా - వొక్కొక్కరి పైనా - అసభ్యకరమైన  పదజాలం విసిరి హింసించే వాళ్ళు. అయిదేళ్ళ పసిపాప నుండి   - ఎనభై ఏళ్ళ ముదుసలి వరకూ - ఎవరినీ వారు విడిచి పెట్ట లేదు.

వచ్చే ప్రతి స్టేషన్ లోనూ - కొత్త వాళ్ళు   రావడం, వాళ్ళలో - మరి కొందరు ఆ ద్వారం వద్ద నిలబడడమూ  -  గుంపు ఎక్కువయ్యే కొద్దీ - స్త్రీల భాగంలోకే వెళ్లి - అక్కడే మరింత రెచ్చి పోయి మాట్లాడడమూ -జరిగేది. మొదటి రోజే - ఈ తంతు భరించడం నాకు చాలా కష్టమయ్యింది. వొక అబ్బాయిని పిలిచి - మన ప్రక్క ఖాళీయే   కదా. అక్కడకెళ్ళి కూర్చోకూడదా- అన్నాను. ఆ అబ్బాయి పెద్దగా నవ్వి - పూర్తిగా స్త్రీల భాగంలోకి చొచ్చుకెళ్ళాడు.

సరే. ప్రక్క నున్న ప్రయాణీకులతో మాట్లాడి - మనమంతా - వారికి - నచ్చచెప్ప కూడదా - అన్నాను. వారంతా, పెదవి విరిచేశారు. ఏమీ లాభం లేదు సార్. వీరు   ఎవరి మాటా వినే రకాలు కారు. మనం చెబితే - మరింత రెచ్చి పోతారు. ఎక్కువ చెబితే - కొట్టినా కొడతారు. వినరు గాక వినరు - అన్నారు. పది రోజులు ఈ తంతు భరించాను. కాని తరువాత - ఏదో చెయ్యాలి. ఏదైనా చెయ్యాలి - అనిపించింది.

పదకొండో రోజు - ఆఫీసు చేరిన వెంటనే - అదే మూడ్ లో -  టెలిఫోను డైరెక్టరీ లో - రైల్వే వారి పబ్లిక్ గ్రీవెన్సస్  సెల్ వారి అడ్రెస్సు, సదరు ఆఫీసర్ల పేర్లు, చెన్నై డివిషన్ సూపరింటెండెంటు   వారి పేరూ , అడ్రెస్సూ అన్నీ రాసుకున్నాను.

తరువాత దాదాపు పది పేజీల సుదీర్ఘ లేఖ తయారు చేసాను. అసలు ఏం జరుగుతోంది - అన్నది పూస గ్రుచ్చినట్టు  రాసాను. దాని క్రిందే - దానికి పరిష్కార మార్గాలు కూడా చాలా రాసాను. అయితే - అవన్నీ - గాంధీ గారి అహింసా మార్గాలే. యివన్నీ రాసి, ఆ అడ్రెస్సులకు అన్నిటికీ పంపించేసి  - అబ్బ, ఏదో చేయగలిగింది చేసాను - అని అనుకున్నా.

తరువాత పది రోజులు ఏమీ కాలేదు. పదకొండో రోజు - యిద్దరు పోలీసు ఆఫీసర్లు మా ఆఫీసుకు - నన్ను వెతుక్కుంటూ వచ్చారు. నా రూముకే వచ్చారు. వారిని కూర్చోమని - పని ఏమిటి - అని అడిగాను.  వారు - నేను రాసిన లేఖను చూపి - అది నేను రాసిందేనా అని అడిగారు. నాకు మనసులో - చిన్న జంకు. కానీ- ఎందుకో - గాంధీ గారు గుర్తుకొచ్చారు. భయమెరుగని గాంధీ దేశంలో పుట్టి - మంచి పనికి భయపడడం ఎందుకనిపించింది.

అంతే. మరి భయం లేదు. జంకూ లేదు. అవును అన్నాను. వారు - అసలేం జరుగుతోందో - నేను చూసినవన్నీ చెప్పమన్నారు. ప్రతి వొక్కటీ - వొక్కటి వదలకుండా - అన్నీ - కాస్త ఆవేశం గానే చెప్పాను.

చివర అన్నాను - ఆ రైళ్ళలో - మా వాళ్ళు గానీ, మీ వాళ్ళు గానీ ప్రయాణం చేసినా - ఎవరూ సంతోషంగా దిగ లేరు. ఎంత మంది స్త్రీలు డిప్రెషన్ కు  లోనవుతున్నారో - మనకు తెలీదు. ఎంత మంది ఈ బాధ భరించలేక  ఉద్యోగాలు, చదువులు వదిలేస్తున్నారో కూడా తెలీదు. ఇవేవీ చేయలేని వాళ్ళు - ఎవరో వొకరు ఆత్మహత్యలు చేసుకున్నా - ఆశ్చర్య పడనక్కర లేదని చెప్పాను.

వారు చాలా వోపిగ్గా విన్నారు. కడపట, నేను యిచ్చిన పరిష్కార మార్గాల గురించి కూడా చెప్ప బోయాను. అప్పుడు   - వారు కాస్త నవ్వి - సార్, మీరిచ్చిన  ఈ వివరాలు మాకు చాలు. మీ పరిష్కార మార్గాలు -అటువంటి దుర్మార్గుల పై పని చెయ్యవు. ఎం చెయ్యాలో - మేం చూసుకుంటాం.  అన్నీ - మీకు కూడా తెలుపుతాం. మీకు మా ధన్యవాదాలు -  అని వెళ్ళిపోయారు.

తరువాత, మా ఆఫీసులోని వాళ్ళంతా - వచ్చి విషయమేమిటని అడిగారు. చెప్పాను. వారందరి ఏకగ్రీవమైన అభిప్రాయం - నేను చాలా తొందర పాటు పని చేసానని. ఈ పోలీసులు మనల్నే వేధిస్తారు కాని - అసలు రౌడీలపై ఏ ఆక్షనూ   తీసుకోరు. పైపెచ్చు - ఆ రౌడీలకు మీ పేరు తెలిసిందంటే - మీపై కక్ష సాధింపు చర్యలకు దిగుతారు - అంటూ ఎన్నెన్నో చెప్పారు.

కానీ అప్పటికి - నా మనసులో - వొకే ఆలోచన. యింత దూరం వచ్చాక - ఏదైనా జరగనీ. చూచుకుందాం-అని. ఏదో అంటారు కదా. రోటిలో తల పెట్టి, రోకటి పోటుకు వెరువరాదని. నా సహ ఉద్యోగులు మాత్రం ఎం జరుగుతుందో, ఏమో  - అని చెబుతూనే వున్నారు, ప్రతి దినమూ.  నాలుగు రోజులు ఏమీ జరగలేదు.

తరువాత - వొక రోజు, మా అన్న కొడుకు వచ్చి- చిన్నాన్న! ఈ రోజు నిజంగా మన పోలీసులు పోలీసుల మాదిరి పని చేసారు - అన్నాడు. తనొచ్చిన ట్రెయిన్ లో - స్త్రీల భాగంలో నిల బడ్డ వారిని - బయటికి లాగి -అంతే కాక, వారి ద్వారం దగ్గర నిలబడ్డ వారందిరినీ బయటికి లాగి - వారి లాఠీలకు బాగా పని కల్పించారట . అందులో - ముఖ్యమైన వారిని - అరెస్టు చేసి కూడా తీసుకెళ్ళారట.    ఆహా - అనుకున్నానే - కానీ, యిది, నా నిర్వాకమే అన్నది అప్పటికి అర్థం కాలేదు.

తరువాత ట్రైన్లో వచ్చిన నా మరదలూ, ఆ తర్వాత వచ్చిన మా ప్రక్కింటి వాళ్ళూ - యిలా చాలా మంది - యిదే చెప్పడం జరిగింది. అంటే  - ప్రతి ట్రెయిన్ లోనూ  - పోలీసులు తమ ఆక్షన్ ను జరుపుతున్నారని అర్థమయ్యింది. అప్పుడు - కాస్త సందేహం - యిది నా నిర్వాకమే నేమో నని. కానీ అనుకున్నా - మరెవరైనా కూడా రాసిండొచ్చుగా     - అని.

తరువాత పదిహేను రోజులు - ప్రతి ట్రెయిన్ లోనూ - యిదే తంతు -విడవకుండా జరిపారు రైల్వే పోలీసులు.

 తరువాత - నాకు వారి పబ్లిక్ గ్రీవెన్సస్ సెల్ నుండీ, చెన్నై రైల్వే సూపరింటెండెంట్ వారి నుండీ -    రిప్లై లేఖలు అందాయి. అందులో - వారు నా లేఖ పై తీసుకున్న ఆక్షన్ అంతా - పూర్తిగా తెలపడమూ,   యిక ముందు కూడా, యిటువంటి స్త్రీ వేధింపు చర్యలు జరగకుండా చూసు కుంటామని  హామీలు యివ్వడమూ - యిలా అన్ని విషయాలూ రాసారు. 

కానీ - వారు, నన్ను మళ్ళీ  పిలవడమో, ఏ రకంగా నైనా నాకు కష్టం కలిగించడమో - అస్సలు చెయ్య లేదు. ఆ రోజు నుండీ - ఈ పదిహేడు సంవత్సరాలుగా - ఆ ట్రెయిన్ మార్గంలో - మళ్ళీ అటువంటి స్త్రీ వేధింపు చర్యలు జరగడం లేదన్నది - వాస్తవం. అటువంటి ఆఫీసర్లకు, ఆ పోలీసులకు - మనం హృదయ పూర్వక అభినందనలు తెలపాల్సిందేగా .ఆ తరువాత ఎప్పుడో, మాయింట్లో వారికి కూడా యివన్నీ  చెప్పాను. ఈ రిప్లై లేఖలు చూపాను.


ఈ మధ్య ముంబై లో జరిగిన కీనన్, ర్యూబెన్ ల హత్యలో - స్త్రీ వేధింపు చర్యలే మొదటి ఘట్టంగా వుండింది. పత్రికల్లో , టీ.వీ ఛానళ్లలో - అక్కడ వున్న వారెవరూ - హతులకు సపోర్టుగా రాలేదని ,యిది చాలా తప్పనీ రాసారు.  నిజమే, కొంత వరకు. కానీ- చాలా మంది ప్రజలలో - రౌడీలకంటే - పోలీసులంటే - ఎక్కువ భయం ఉందన్నది తెలుసు గదా. కానీ రౌడీలకు పోలీసులంటే పెద్ద భయం లేదు.  యిది పోగొట్ట వలసిన బాధ్యత- పోలీసు వ్యవస్థ దే నని చెప్పక తప్పదు. మన దేశమంతటా   -  యిది జరగాలి.

పోలీసుల్లో మంచి వాళ్ళు ఎంతో మంది వుండొచ్చు. కానీ లంచగొండి తనమూ, ఎక్కువే నని ప్రజల నమ్మకం. అటువంటి వారి దగ్గర అన్యాయమే జరుగుతుందని వొక విశ్వాసం. అందు వలన - ఎక్కడ ఏ అన్యాయం జరిగినా - సాధారణ ప్రజలు పట్టించుకోవడం వదిలేశారు.  వారిలో ధైర్యమూ ,విశ్వాసమూ కలిగించ వలసిన  బాధ్యత పాలక వర్గానిదీ, పోలీసులదీను. కొన్ని, కొన్ని చోట్ల ఇది జరుగుతున్నది. చాలా చోట్ల జరగాల్సి ఉంది.

సరే. స్త్రీలపై  వేధింపు చర్యలను - అరికట్టేందుకు - కొన్ని చోట్ల  ( ముఖ్యంగా చెన్నై లో ) అప్పుడప్పుడూ, మహిళా పోలీసులను సాధారణ దుస్తులలో బస్సు స్టాపుల్లోను, రద్దీ ప్రాంతాల్లోనూ నిలిపి,  వారి ద్వారా ఈ రౌడీలను పట్టేస్తున్నారు.  పూర్తిగా పోక పోయినా -  యిప్పుడు, చాలా  తగ్గిందని చెప్పొచ్చు. యిటువంటివి - బస్సుల్లోనూ, యితర రద్దీ ప్రాంతాల్లోనూ - యింకా జరగాల్సిన అవసరం ఉంది.

ముంబై, డిల్లీ లాంటి పట్టణాలలో - స్త్రీ వేధింపు చర్యలు ఎక్కువగానే వున్నాయి. పోలీసు వ్యవస్థ -కంప్లయింటు కోసం ఎదురు చూడకుండా - ముందు చూపు చర్యలు తీసుకుంటే - అంటే-   వేధింపులు జరిగే సమయంలో, జరిగిన చోట, రౌడీలను పట్టుకుంటే, వారికి కావలసిన శాస్తి చేస్తే - పోలీసుల పై ప్రజలకు గౌరవమూ పెరుగుతుంది. మన దేశం మరింత శాంతివంతం గానూ, నేరప్రవృత్తి లేకుండానూ  వుంటుంది.

అలాగే - కంప్లైంటు ఇచ్చే వారిని - మళ్ళీ మళ్ళీ పిలిచి వేధించకుండా , వారిని  నేరస్తుల ముందు పిలువకుండా - వారికి తగిన ప్రోత్సాహం యిస్తూ వుంటే - ధైర్యం గా కంప్లైంటు యివ్వగలరు. యిది మన దేశ / రాష్ట్ర  మహిళా కమిషన్ వారు కూడా పరిశీలించి తగిన సూచనలు, చర్యలు చేబట్టాల్సిన అవసరం ఉంది.

యిది చేస్తేనే - స్త్రీలకూ కూడా పురుషులపై గౌరవం పెరుగుతుంది.

మన  ప్రాచీనులు అంటారు - ఏ దేశంలో అయితే, ఏ యింట్లో అయితే - స్త్రీ కంట తడి పెడుతుందో - ఆ దేశం లో , ఆ యింట్లో, దేవతలు వుండరు. నీళ్ళు కూడా వుండవు. వానలు కురవవు -  అని. అందుకే గాంధీ గారు కూడా అన్నారు - అర్ధ రాత్రైనా, ఏ స్త్రీ అయినా , భారత దేశం లోని ఏ రోడ్డు లో నైన ,ఎక్కడైనా, వొంటరిగా,  ప్రయాణం చేయ గలిగిన పరిస్థితి రావాలి. అప్పుడే, మనకు నిజమైన స్వతంత్రం -అని.

చదువరులకు - వొక విన్నపం. మనమంతా, మన మహిళా కమిషన్ వారికి - యిటువంటి సూచనలు రాయాలి. అప్పుడే - ఈ జగన్నాథ రథ చక్రాలు కదుల్తాయి. మంచి రోజులు వస్తాయి. మంచి పని అనుకుంటే - వెంటనే చేసెయ్యండి. 

=మీ

వుప్పలధడియం విజయమోహన్


12, నవంబర్ 2011, శనివారం

భయమూ - దానికి గల కారణాలూ - మన మానసిక ఆరోగ్యమూ



మనం  కొన్ని వ్యాసాలలో యిది వరకే - మానసిక ఆరోగ్యం గూర్చి లోతుగా పరీక్షించాము .  అందులో - మితి మీరిన కోరికే -మానసిక అనారోగ్యానికి ప్రథమ కారణం అని తెలుసుకున్నాము. అన్ని మతాలలో - వుండేదీ అదే.

కోరిక తప్పు కాదు. కోరిక అనారోగ్యం కాదు. కోరిక లేని నాడు - మనిషే లేడు. కృష్ణుడికి కోరిక లేదా? భగవద్ గీత చెప్పడం ఎందుకు? అర్జునా! యుద్ధం చెయ్యి - అని ప్రోత్సహించడం ఎందుకు?

దేవుడి కోరికను - సంకల్పం  అన్నారు. అంటే - వుట్టి కోరిక కాదు. తీరగలిగే కోరిక. ఆ కోరిక వెనుక, వొక బలమైన సకారాత్మక శక్తి కూడా వుంది. అందు  వలన అది జరిగి తీరుతుంది. మనమైనా అంతే. తీరగలిగే కోరకలు కోరుతూ - వాటి వెనుక, బలమైన, సకారాత్మక శక్తినీ - పెట్టామంటే -  మీ కోరిక వెనుక ప్రకృతి శక్తులన్నీ కూడా తోడుంటాయి. మీ కోరికలు తప్పక తీరుతాయి. అందువలన మీ జీవితంలో - సంతోషమూ, ఆనందమూ - నిండుతాయి. 

అదే - మానసిక ఆరోగ్యమని  చెప్ప వచ్చు. 

కాబట్టి - 

తీరని కోరికలు కోరకండి.  ఎండమావుల వెనుక పరుగెత్తకండి. 

మనిషి ఎవరైనా వొక్క సారి, వొక్క అడుగే వెయ్యాలి. వెయ్య గలడు. ఆ అడుగు ప్రమాణం మీ శక్తి సామర్థ్యాల పైన ఆధారపడి  వుంటుంది. వొకరి అడుగు చిన్నది గాను, మరొకరిది, కాస్త పెద్దది గాను వుండొచ్చు .

నడిచి వెళ్ళే వాళ్ళు - యిరవై, ముప్ఫై  మైళ్ళు నడవ గలిగితే - పరుగెత్తే వాళ్ళు - వొక్క కిలోమీటరు దూరం కూడా వెళ్ళ లేరు. జీవితమంతా పరుగెత్తాలనుకునే వాళ్ళు - ఎక్కువ కాలం పరుగెత్త లేరు. ఏ విషయం లో నైనా అంతే.

యివి జ్ఞాపకం పెట్టుకుంటే - హాయిగా - జీవితమంతా గడిపెయ్య వచ్చు.

సరే. మానసిక అనారోగ్యంలో - మరికొన్ని సమస్యలున్నాయి.

మనిషికి భయం -అనేది పెద్ద అనారోగ్య లక్షణం. భయానికి ముఖ్య కారణం మన అజ్ఞానం, అశ్రద్ధ .

ఉదాహరణకు - చాలా మందికి - బొద్దింక అంటే  భయం. అది పెద్దగా కరవదని తెలుసు. కరిచినా పెద్ద ప్రమాదమేమీ లేదని తెలుసు. అయినా - అదంటే కాస్త భయం. ఎందుకంటే -  బొద్దింకకు  మనమంటే భయం లేదు. నేరుగా - మనమెక్కడున్నామో అక్కడికే వచ్చేస్తుంది. మీరు దూరంగా - తోసేసినా, మళ్ళీ దగ్గరగా వచ్చేస్తుంది. కాస్త ఏమరుపాటుగా వుంటే - దుస్తుల్లోకి వెళ్లి పోతుంది. ఎందుకో తెలీదు. యిదీ చాలా మంది భయం.  కొంత మంది - దాన్ని చంపకుండా, దాని మీసాలు పట్టుకుని దూరంగా విసిరేస్తారు. వారికి  బొద్దింక భయం లేదని చెప్పొచ్చు. కొందరు ఏ చీపురు కట్ట తోనో - దానిపై పట్టుమని కొడతారు. అది చచ్చిపోతుంది. తరువాత దాన్ని చీపురుకట్టతోనే బయట పార వేస్తారు.యిక్కడ హింసా వుంది. భయమూ వుంది. 

మన యిండ్లలో వుండే యెర్ర చీమ - దేవుడిని వరం అడిగిందట. నేను కుడితే చచ్చిపోవాలని. దేవుడు తథాస్తు అన్నాడట. అప్పటినుండి యెర్ర చీమ కుడితే - దాన్ని చంపేస్తారు. అది చచ్చిపోతుంది. వరం ఎలా అడగాలో కూడా చీమకు తెలియలేదు. బొద్దింక - పాపం, కుట్టక పోయినా చచ్చి పోతుంది.

సరే. పామంటే - చాలా మందికి భయం. అందులో విషం వుండే పాము ఏదో, విషం లేని పాము ఏదో చాలా మందికి ఖచ్చితంగా తెలీదు.ఏ పామైనా భయమే. కానీ, కొంత మందికి భయం లేదు. వారు, పెద్ద పెద్ద నాగుపాములతో కూడా ఆడుకుంటారు. పాములను చంపడం తేలికే. కాస్త ధైర్యమూ కావాలి. మెళకువలూ తెలిసుండాలి. అంతే. తెలీకపోతే - పాములకు దూరంగా వుండడమే - మంచిది.

కుక్కలంటే - కొంత మందికి భయం. పిచ్చి పట్టని కుక్క సాధారణంగా, మనిషిని ఏమీ చెయ్యదు. ఎప్పుడో వొక సారి కొరక వచ్చు. అప్పుడు - సరైన ఇంజెక్షన్లు క్రమం తప్పక వేసుకోవాలి. కానీ పిచ్చి పట్టిన కుక్క - తప్పక కొరుకుతుంది. అటువంటిది - ప్రతి వొక్కరికీ - చాలా అపాయం. అప్పుడు ముఖ్యంగా - కొరికిన భాగాన్ని బాగా నీళ్ళతో కడగడమూ   ముఖ్యమే. తరువాత - సరైన ఇంజెక్షన్లు క్రమం తప్పక వేసుకోవాలి. లేదంటే చాలా అపాయం.  కుక్క కాటును ఎప్పుడూ అలక్ష్యం చేయకండి. వొక గంటలోగా - ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా - మీ మొదటి ఇంజెక్షను వేసుకోండి. ఏ కుక్క కొరికినా క్రమం తప్పకుండా - ఇంజెక్షన్లు వేసుకోండి.

అలాంటి పిచ్చి కుక్క నన్నూ వొక సారి వెనుక నుండీ వచ్చి కొరికింది. - నాలుగేళ్ల క్రిందట. వెంటనే కొరికిన భాగాన్ని నీళ్ళతో బాగా కడిగేసి - మా ఊళ్లోనే వున్న డాక్టరు గారి దగ్గర ఆంటీ రాబీస్ ఇంజెక్షన్లు క్రమం తప్పక వేసుకున్నాను. తరువాత దాని వలన ప్రమాదమేమీ లేదు. అయితే - ఈ మధ్య మన రాష్ట్రంలో - వివిధ ప్రాంతాలలో - పిచ్చి కుక్క చాలా మందిని కొరికిన సంఘటనలు చాలా విన్నాము.  అవి కాస్త పెద్ద ఊళ్ళే అయినా -   ఆంటీ రాబీస్ ఇంజెక్షన్లు - అక్కడ లేక పోవడం చాలా దురదృష్టకరం.

మీ వూళ్ళో - ఈ ఆంటీ రాబీస్ ఇంజెక్షన్లు ప్రతి డాక్టరు దగ్గరా వుండాలి. లేకపోతే - వెంటనే - ప్రభుత్వం వారికి ప్రతి వొక్కరూ రాయండి. పిచ్చి కుక్క కాటుకు, పాము కాటుకు మందు మాత్రం - ప్రతి వూర్లో వుండి తీరాలి.  అంతే కాదు. కరిచిన వెంటనే కరిచిన భాగాన్ని కడగడము, వెంటనే డాక్టరు గారి దగ్గరకు వెళ్ళడము మనం చెయ్యాలి. దీన్ని గురించి మరింత సమగ్ర సమాచారం - నా మరో బ్లాగులో - వైజ్ లివింగ్ ఐడియాస్ . బ్లాగ్ స్పాట్. కాం లో రాసాను. ఎందుకంటే - భారత దేశంలోని - ప్రతి గ్రామంలోనూ- ప్రతి పట్టణంలోనూ - వీధి కుక్కలూ వున్నాయి. కొంత వరకూ - పాములూ వున్నాయి. అందు వలన వాటి వలన వచ్చే ప్రమాదాలూ, విరుగుళ్లూ అందరికీ తెలిసుండాలి. నిజానికి - యిది - ఐదో  తరగతి చదివే విద్యార్థికి కూడా  సమగ్రంగా తెలిసుండాలి. 

మన దురదృష్టం ఏమంటే   - మన చదువులో - మనకు ఉపయోగ పడేది చాలా తక్కువ. ఎప్పుడో ఏదో చేసిన ఔరంగజేబు ను గురించి చాలా చదువుతాము. యిందు వలన మనకొచ్చే ఉపయోగం - నన్నడిగితే సున్నా.

దారిలో రోజూ కనపడే పాములు, కుక్కలు మనల్నేం చేస్తాయో, మనమేం చెయ్యాలో - మనకు తెలీదు. వాటికి కావలసిన మందులు - ఘనత వహించిన మన  ప్రభుత్వం వారు - చాలా ఊళ్లలో సప్లయ్ చేసినట్టు లేదు. మనమూ అడిగేటట్టు లేదు. సరైన చదువు ద్వారా వీటన్నిటిని గురించిన విజ్ఞానమూ రావాలి. సరైన విజ్ఞానముతో బాటు, వీటివలన వచ్చే భయమూ పూర్తిగా పోవాలి. ఈ రెండూ చదువు ద్వారా జరగడం లేదు. కనీసం పాము యొక్క మృత శరీరాన్నైనా  విద్యార్థులు తాకి పార వేసేటట్టుగా వుండాలి. 

నాగు పాములంటే మనకు భయమూ వుంది. భక్తీ వుంది. కానీ పాముకాటుకు మన వూళ్ళో మందు వుందో లేదో మాత్రం తెలీదు.



మనకు తెలుసు - మన పూర్వీకులలో చాలా మంది అరణ్యాలలో వుండే వారని. కొందరు రుషులుగా తపస్సు చేసుకుంటూ వుంటే - మరి కొందరు - వేట తోనో, మరో వృత్తి తోనో  అడవుల్లో జీవించే వారు.  పులులు, సింహాలు కూడా వున్న అడవుల్లో - వారు భయపడ కుండా వుండే వారు.  మేము పిల్లలు గా వున్న సమయంలో కూడా - వూరి బయటే- పెద్ద అడవులుండేవి .  మృగాలూ, పాములూ, తేళ్ళూ- అన్నే వుండేవి. కానీ- మనస్సులో ఎవరికీ భయం వుండేది కాదు. యిప్పుడు - అడవులూ లేవు. మృగాలూ చాలా వరకూ లేవు. కానీ - పాములు - అందులోనూ విష సర్పాలు యింకా  చాలా వున్నాయి. వాటి కాట్లకు ఉపయోగ పడే పాత మందుల పరిజ్ఞానం యిప్పుడు లేదు.కొత్త మందులు సప్ప్లై  లేదు. 

వీధి కుక్కలు వున్నాయి. వర్షాలు వొచ్చినప్పుడో, పిల్లలు పుట్టినప్పుడో - వొక్కొక్క సారి - వాటికి పిచ్చి పడుతూ వుంటుంది. అలాంటప్పుడు, అవి స్వంత పిల్లల్ని కూడా చంపేయడం జరుగుతూ ఉంది. అప్పుడే - కనిపించిన మనిషినల్లా కొరకడం కూడా జరుగుతూ వుంటుంది. అప్పుడు - మన ఆధునిక పరిజ్ఞానం ప్రకారం - వాటిని పట్టుకుని , రెండు వారాలు వాటిని జాగ్రత్తగా గమనించమని అంటారు. యిది నాకు వొక పిచ్చి సలహా గా కనిపిస్తుంది.

నన్నడిగితే - పిచ్చి కుక్కను మీరు పట్టుకునే ప్రయత్నం చేయడమంత    మూర్ఖత్వం మరోటి లేదనిపిస్తుంది. బ్లూ క్రాస్ వాళ్ళను పిలిచి - అయ్యా- పిచ్చి కుక్క మమ్మల్ని కరిస్తే - మేము దాన్ని ఏం చేయాలి - అని వారిని అడగండి.  సమాధానం వాళ్ళ దగ్గరా లేదు. యిది ఎలా వుంటుందంటే   -  మమ్మల్ని ఎవడైనా మర్డరు లేదా రేపు చేయడానికి వస్తే - మేమేం చెయ్యాలి అని పోలీసు వాళ్ళను అడగండి. వాళ్ళేం చెబుతారు? మీరు చట్టాన్ని మీచేతిలోకి తీసుకోకూడదు. మా దగ్గరకు వచ్చి చెప్పండని చెబుతారు.

మిమ్మల్ని మర్డరు చేసిన తరువాత పోలీసు స్టేషనుకు వెళ్లి చెబుతారా.

మిమ్మల్ని రేపు చేసేంత  వరకూ ఆగి తరువాత పోలీసు స్టేషనుకు వెళ్లి చెబుతారా. 

మిమ్మల్ని పిచ్చి కుక్క కరిచేంత   వరకూ చూస్తూ వుండి , దాన్ని మెల్లగా పట్టుకుని బ్లూ క్రాస్ వారికి అప్పగిస్తారా?

నాకయితే - మన డెమాక్రసీ ప్రభుత్వాల  కంటే - కొంత మంది పాత కాలపు రాజులు ఈ విషయంలో - తెలివిగా చట్టాలు చేసే వారని అనిపిస్తుంది.  మన చాలా భయాలకు కారణం మన ప్రస్తుత విద్యా విధానము, పాలనా విధానము, మన చట్టాలు, వాటిని మనం అమలు చేస్తున్న తీరు  - అని చెప్పక తప్పదు.

మిమ్మని రేపు చేసారనుకోండి. మీరూ తీరిగ్గా వెళ్లి పోలీసు వారికి రిపోర్టు ఇచ్చారనుకోండి.  ఏం జరుగుతుందో - మనకు తెలీదా. పోలీసు స్టేషన్లో ఏమీ జరక్క పోయినా - మరో సారి పత్రికల్లో, కోర్టుల్లో తప్పక  మీ రేపు జరుగుతుంది. సరే. కేసు ఏ యుగంలో ముగుస్తుందో - ఎలా ముగుస్తుందో ఎవరూ చెప్ప లేరు.

మన చాలా భయాలకు - కారణం మన చట్టాలూ, దాన్ని మనం అమలు చేస్తున్న విధానమే అని నాకు అనిపిస్తుంది. జాతిని, పూర్తిగా నిర్వీర్యం చేసే ఈ పాలనా విధానం మారాల్సిన అగత్యం ఉంది. 

ఈ మధ్య కీనన్ సాన్తోజ్ , ర్యూబెన్ ఫెర్నాండెజ్ అనే యిద్దరు యువకులు  ముంబై వీధులలో గూండాలచేత హత్య చేయ బడిన విషయం  మనకందరికీ తెలిసిన విషయమే.వొక అమ్మాయిని, పట్ట పగలు, నడివీధిలో, గూండాలు  అవమానం చేస్తూ వుంటే - సహించ లేక వాళ్ళను ఈ యిద్దరు యువకులూ అడ్డుకున్నారు. అక్కడికక్కడే - వాళ్ళను ఆ గూండాలు కత్తులతో పొడిచి చంపేశారు.   సరే. నలభై మంది ఆ ఘటనను చూస్తూ వున్నారు. కానీ   వారెవరూ  ఆ గూండాలను అడ్డుకోలేదు. కీనన్ తండ్రి గారు - తరువాత "కీనన్   చేసింది సరి అయిన  పని.  పిరికి వాడిగా జీవించడం కంటే - అన్యాయాన్ని ఎదుర్కొని కీనన్ లాగ మరణించడమే మంచిది" అన్నారు.

నిజమే. మన సమాజం అన్యాయాన్ని ఎదుర్కొనే ధైర్య వంతులను తయారు చెయ్యాలి.  పిరికి వాళ్ళను కాదు.

కానీ - ఆ చూస్తూ ఊరుకున్న నలభై మందిని అడగండి - వాళ్ళెందుకు వూరుకున్నారో తెలుస్తుంది. మన చట్టాలు, మన పోలీసులు, మన పాలనా వ్యవస్థ  - ఏ వొక్కటీ మనలను ధైర్య వంతులను చేసేవి కావని తప్పక చెబుతారు. వారు భయపడింది - గూండాలకు కాదు. వారి వెనుక నున్న వారికి. చట్టాన్ని తమ చేతిలో కీలు బొమ్మగా నడిపిస్తున్న వారికి.  యిది మారాలి. యిది మారాలంటే - మన విద్యా వ్యవస్థ మారాలి. మనలను చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించే వారిగా తయారు చేసే  విద్య రావాలి. 

మీ వూళ్ళో - గూండాలెవరో - మీ వూళ్ళో పోలీసులకు తెలీదా.   వాళ్ళేం చేస్తున్నారో వీరికి తెలీదా. మరి గూండాలు -  గూండాలుగానే  ఎలా కొనసాగుతున్నారు?

యిప్పుడు మన దేశంలో -ఏ విషయాన్ని కదిపినా - వందల, వేల, లక్షల కోట్ల లంచ గొండి తనం  బయటకు వస్తూ ఉంది. మరి - ఈ వ్యవస్థను సరిచేసే నాథుడు ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదు. పాలకులలో లేని మానసిక ఆరోగ్యం ప్రజలలో ఎలా వుంటుంది.

యథా రాజా, తథా ప్రజా. మీరు ఏ రాజా గురించైనా అనుకోండి. దాదాపు యిదే కథ గా ఉంది.

ఈ వ్యవస్థ మారాలి. ఎలా మారుతుంది. మనం అందరూ కలిసి మార్చాలి. కనీసం అది మార్చడానికి ప్రయత్నిస్తున్న - అన్నా హజారే, రాం దేవ్ జీ, జయప్రకాశ్ నారాయణ్   లాంటి వారికి పూర్తి మద్దతు నివ్వాలి.

పాలకుల లోనూ, ప్రజలలోనూ - న్యాయానికి, ధర్మానికి విలువ వచ్చేటట్టు మనం చూడాలి.  అది వుంటే - మనలోని భయాలు చాలావరకు పోతాయి.   అది రావాలంటే - మన విద్యా వ్యవస్థ - బాబర్లు , ఔరంగజేబులను కాస్త వదిలి పెట్టి - ప్రస్తుత సమాజ సమస్యలకు రావాలి. మానవ విలువలను విద్యార్థులలో నింపాలి. కనీసం వచ్చే తరం అయినా బాగుంటుంది. భయం లేని వారిగా, ధైర్య వంతులుగా వుంటారు. చట్టాలను కాస్త మానవతా దృక్పథంతో తయారు చెయ్యాలి. వాటిని అమలు చెయ్యడం కూడా అలా వుండాలి. 

యిదంతా ఎందుకు చెబుతున్నానంటే -  అమెరికాలో , బ్రిటన్ లో ప్రజలకు   వున్న  ధైర్యం భారత దేశ ప్రజలకు ఈ రోజు లేదు.  అది వారి తప్పు కాదు. పాలకుల తప్పు. అటువంటి పాలకులను  ఎన్నుకోవడం ప్రజల తప్పు.

భయాన్ని గురించి మనం తెలుసుకోవలసిన మరి కొన్ని ముఖ్యమైన విషయాలు మరో వ్యాసంలో చూద్దాం.

= మీ

వుప్పలధడియం విజయమోహన్

2, నవంబర్ 2011, బుధవారం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడెలా వుంది? = భిన్నత్వంలో ఏకత్వం = దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ = నాది భారత దేశం. అంతే.


1953, నవంబర్, వొకటవ తేదీ నాడు కర్నూలు రాజధానిగా  ఆంధ్ర రాష్ట్రం గా మొదట అవతరించి, తరువాత, 1956 , నవంబర్,వొకటవ  తేదీ నాడు హైదరాబాద్ రాజధానిగా ఆంధ్ర ప్రదేశ్ గా మారిన మన రాష్ట్రం  ఇప్పుడెలా వుంది? ఎందుకలా వుంది? 

మొన్న,మొన్న జరిగిన అసెంబ్లీ ఎలెక్షన్లలో కూడా, ప్రజలందరూ - సమైక్యంగా వుండాలనే పార్టీలకే వోటు చేసారు. ఆ తరువాత  వై.యస్.ఆర్. గారు పోవడమూ, మరో సరైన, సమర్థుడైన, అందరూ వొప్పుకో గలిగే  నాయకుడు రాక పోవడమూ జరగడం తో -  వేర్పాటు వాదం బలపడిందని అనిపిస్తుంది.

భారత దేశంలోనే - మొదటి నుండి - భిన్నత్వంలో ఏకత్వం - అని మనం అంటున్నా కూడా,  ఏకత్వాని కంటే, భిన్నత్వానికే ప్రాముఖ్యమిచ్చే  రాజకీయ వాదులు - అన్ని రాష్ట్రాల్లో బల పడుతుండడం  మెల్ల మెల్లగా జరుగుతోంది.

ప్రతి రాష్ట్రంలోనూ యిదే కథ. భాషకు చాలా ఎక్కువ ప్రాధాన్యత నిచ్చే తమిళనాడు లాంటి కొన్ని రాష్ట్రాలలో తప్ప - భాష కూడా మనుషులను కలిపే ముఖ్యమైన సాధనంగా వుండడం లేదు.  

అంటే - వేర్పాటు వాదాలకు - బలమైన కారణాలే లేవా? వుంటాయి. విడిపోవడానికి ఎన్నో బలమైన కారణాలు మనం చూడొచ్చు. అలాగే - కలిసి వుండాలంటే కూడా - ఎన్నో బలమైన కారణాలూ మనం చూడొచ్చు.

యిది పాత కథే. గ్లాసు అర్ధం నిండి వుందా? అర్ధం ఖాళీగా వుందా? అనేది - చూసేవారి దృక్పథం పైన ఆధార పడి వుంది. వారూ కరెక్టే. వీరూ కరెక్టే. నేను ఖాళీనే చూస్తాను -అనుకుంటే - ఖాళీనే చూడొచ్చు. నేను నిండి వున్న భాగాన్నే చూస్తాను - అంటే -  నిండి వున్న భాగాన్నే చూడొచ్చు.

అమెరికాలో - యిప్పుడు జరుగుతున్న పెళ్ళిళ్ళలో - యాభై శాతం పైన - చాలా త్వరగా, విడాకులలో, ముగిసిపోతూ వుందట. వీరంతా ఖాళీ భాగాన్ని ఎక్కువగా చూస్తారనిపిస్తుంది . మిగతా వారు కలిసే వున్నారు. వీరు నిండి వున్న భాగాన్నే ఎక్కువగా చూస్తూ వున్నారని అనుకోవచ్చు.

కొంత మంది లాయర్ల వద్దకు వెళితే - ఎంత అన్యోన్యమైన భార్యాభర్తలకు కూడా - ఖాళీ గ్లాసు భాగంలోని జీవితాన్నే చూపించి -  సునాయాసంగా విడాకులు ఇప్పించేయగలరు. మరి కొంత మంది లాయర్ల దగ్గరికి వెళితే -  విడాకులకోసం పోట్లాడుతూ వచ్చిన వారిని కూడా కలిపేయ గలరు. 

వైవాహిక జీవితంలో - అసలు పోట్లాడని భార్యాభర్తలున్నారా? అలాటి జీవితంలో అస్సలు రుచి లేదని కూడా మనకు తెలుసు కదా. అలాగని - పోట్లాటలు మాత్రం జ్ఞాపకం వుంచుకొని - అందరూ విడిపొతున్నారా?  రోజూ కొట్లాడే భార్యాభర్తలకు కొందరికి - వొకరినొకరు చూడకుంటే - క్షణమైనా గడవదు. వాళ్ళు కలిసే వున్నారు. ఎప్పుడో వొక రోజు కొట్లాడి,  ఆ మాత్రానికి, విడాకుల వరకు పొయ్యే భార్యా భర్తలు కొందరు ఈ కాలంలో తయారవుతున్నారు.

ఇల్లైనా అంతే.  జిల్లా అయినా అంతే. రాష్ట్రమైనా అంతే. దేశమైనా అంతే. యిప్పుడు మన దేశానికి కూడా, దేశమంతటా వొప్పుకో దగ్గ నాయకుడో, నాయకురాలో కావాలి. దేశ నాయకుడంటే -   దేశమంతా నాది. దేశ ప్రజలందరూ - నా వాళ్ళు -వారందరి బాగు కోసం నేను కృషి చేస్తాను - అని మనసారా  కోరుకునే వారు, ప్రతి ప్రాంతం లోని వారితో సులభంగా కలిసి పోయే వారూ నాయకులు గా రావాలి.

మొట్ట మొదట భారత దర్శనం అని - దేశమంతటా యాత్ర చేసిన గాంధీ గారు - దేశ నాయకుడయ్యారు. మరెంతో మంది స్వాతంత్ర్య యోధులున్నా - దేశమంతటా తిరిగిన నాయకుడుగా గాంధీ గారే మనకు మొదట కనిపిస్తారు. స్వాతంత్ర్యం తరువాత    - నెహ్రూ గారు దేశమంతటా తిరిగి -తద్వారా -దేశప్రజల  మనస్సులో - సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.

ఎంతో మంది ప్రధాన మంత్రులయారు. కానీ - భారత దేశమంతటా తిరిగి, అందరితో కలిసిన  ప్రధాన మంత్రులుగా - నాకు మాత్రం ముగ్గురే జ్ఞాపకం వస్తారు. నెహ్రూ గారు, ఇందిరా గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు.

మిగతా ఎవరూ - దేశమంతటా తిరిగారా లేదా అని నాకు తెలీదు. వారు, వచ్చిందీ, పోయిందీ కూడా గుర్తు లేదు. యిప్పుడు యల్.కే. అద్వానీ గారు దేశంలోని కొన్ని ముఖ్య భాగాలలో రథ యాత్ర చేస్తున్నారు. నిజమే.  కానీ - దక్షిణ భారతంలో కూడా - ఆయన హిందీ లోనే - మాట్లాడి వెళ్లి పోతే - ఆయన వచ్చిందీ, పోయిందీ ఎవరికీ గుర్తుండదు.  అదే - యిందిరా గాంధీ గారు  కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ  వస్తే - ఆంధ్ర దేశంలో రెండు ముక్కలు తెలుగులోనూ, తమిళనాడులో తమిళంలోనూ కర్ణాటకా లో కన్నడంలోనూ తప్పక మాట్లాడుతారు. తరువాత ఆంగ్లంలో మాట్లాడుతారు. ప్రజల మనస్సులో నిలవాలనే ప్రయత్నం చేస్తారు. మిగతా వారిలో అది చాలా తక్కువ.

సరే. యిప్పుడు - దేశ నాయకులుగా వుండాలనే కోరిక వున్న వారు కూడా ఏ పార్టీ లోనూ వున్నట్టు అనిపించదు. రాష్ట్రం సంగతికి వస్తే - అదే సంగతి. రాష్ట్రంలోని అన్ని భాగాలలో నివసించిన వారికైతే -  అన్ని భాగాలనూ వొకే రకంగా చూడాలనే కోరిక వుంటుంది.  తాము పుట్టిన జిల్లానుండి కూడా బయటికి పోనీ వారికి - తాము తప్ప మిగతా అందరూ బాగున్నారు-అని అనిపించడం  సాధారణంగా జరుగుతుం ది. 

అదే విధంగా, వొకే రాష్ట్రంలో, పుట్టి పెరిగి, మరో రాష్ట్రం కూడా చూడని వారికి, జాతీయతా భావం రావడం కాస్త కష్టమవుతుంది. ఇప్పుడున్న ముఖ్య మంత్రులు కానీయండి, యం.యల్.ఏ.లు కానీయండి - ఏ  వొకరిద్దరు తప్ప - దాదాపు అందరూ - తమ రాష్ట్రపు ఎల్లలు దాటని వారే. మరో రాష్ట్రంలో - రెండేళ్ళు వుండి వుంటే - వారి దృక్పథం మరోలా వుంటుంది.

మా నీళ్ళు   మాదే. మా బొగ్గు మాదే. మా గాలి మాదే - అని  రామారావు గారో, జయలలిత గారో అనరు.  అలా అనే వారు - ఆ రాష్ట్రపు పొలిమేరలు దాటలేదని అర్థము చేసుకోవచ్చు.

పొరుగు రాష్ట్రం వారిపట్ల శివ సేన వారు వ్యవహరించేటట్లుగా - టెండుల్కర్  వ్యవహరించలేడు కదా. 

నాయకులు మారాలి. కనీసం భారత దేశమంతా మనది - దేశమంతా అభివృద్ధి చెందాలి - అనే నాయకులు రావాలి. నిజమైన, హృదయపూర్వకమైన జాతీయ దృక్పథం రావాలి.  ప్రతి మంత్రీ, ప్రతి యమ్.యల్.ఏ., ప్రతి యమ్.పీ. భారత దేశమంతా తిరిగీ, ప్రతి సంస్కృతినీ ఆకళింపు చేసుకున్న వారిగా - ప్రతి వోక్కరు నా వారే - అనుకునే వారు గా వుంటే - మన దేశం చాలా బాగు పడుతుంది.

తెలంగాణా రావాలా, వద్దా - అన్నది ప్రశ్నే కాదు. ప్రజలు కావాలనుకుంటే  రావచ్చు. ప్రజలు వద్దనుకుంటే - రాకపోవచ్చు.  చిన్న రాష్ట్రాలలో - మంచి నాయకులుంటే   -  అభివృద్ధి బాగానే వుంటుంది. అయితే- పెద్ద రాష్ట్రాలలో కూడా - అటువంటి అభివృద్ధి సాదించవచ్చు .మనసుంటే - మార్గం వుంటుంది.

కానీ - అభివృద్ధి అంటే - నేలకా, మనుషులకా - అన్నది మనం అర్థం చేసుకోవాలి. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే  మనుషులోయ్ - అన్న సత్యాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. కొన్ని, కొన్ని ప్రదేశాలలో - ప్రకృతి వనరులు వుండవు. కొన్ని ప్రదేశాలలో - ఎక్కువగా వుంటాయి. వొక జీవ నది డెల్టా ప్రాంతంలో పండే పంటలు - మనం ఏం చేసినా - కొన్ని ప్రాంతాలలో పండే అవకాశం లేదు.  వొక చోట గాసు నిల్వలు వుండొచ్చు. మరొక చోట బొగ్గు గనులు వుండొచ్చు. వొక చోట రక రకాల ఖనిజాలు వుండవచ్చు. యిలా - ఎన్నో రకాల ప్రకృతి వనరులు - వివిధ ప్రదేశాలలో వుండ వచ్చు.  నా గాసు, నా బొగ్గు అని అనుకుంటే - బొగ్గు వాడికి గాసు లేదు. గాసు వాడికి బొగ్గు లేదు. అందుకే అన్నారు - దేశమంటే  మనుషులోయ్ - అని.

ముంబై లాంటి మహా పట్టణం - దేశంలో  మరొకటి లేదు. శివ  సేన అది మాదే అంటున్నారు. మరి డిల్లీ ఎవరిది? అలాగే - హైదరాబాద్ ఎవరిది? చెన్నై ఎవరిది?  దేశమంటే  మనుషులే కానీ ఆయా ప్రదేశాలు కావు. యివన్నీ భారతీయులందరిదీ .

మరి ముంబై లాగా చెన్నై ఎందుకు కాలేదు? చెన్నై లాగా హైదరాబాద్ ఎందుకు కాలేదు? హైదరాబాద్ లాగా  చిత్తూరు, కర్నూలు ఎందుకు కాలేదు? చిత్తూరు లాగా, మావూరు ఎందుకు కాలేదు? అలా ఎప్పటికీ కావు.కాలేవు.   కాకుంటే - అన్ని ప్రాంతాలలో - రోడ్లు బాగుండాలి . ఆ రోడ్లు బాగా వేయనివాడు ఖచ్చితంగా - మీ / మా వూరి వాడే అయివుంటాడు. ప్రతి ఊరికీ - మంచి నీటి సదుపాయం వుండాలి. అవి మన రాష్ట్రంలోని నదులు, చెరువుల నుండే  రావాలి. లేదంటే - పక్క రాష్ట్రం నుండీ అయినా రావాలి. 

భారతీయులందిరికీ వారి వారి వూర్లో రోడ్లు, నీళ్ళు, స్కూళ్ళు, దగ్గరలో కాలేజీలు, ప్రతి ప్రదేశంలోని ఉద్యోగాల్లో పాల్గొనే హక్కు - ఇవీ మనకు కావలసిన కనీస సౌకర్యాలు. మన ఊళ్లోనే - వొక స్టీలు ఫాక్టరీ, వొక బొగ్గు గని, వొక నది, వొక విమానాల కర్మాగారం వుండాలంటే - కాదు కదా.

యింతకు ముందు, నాయకులకు వుండ వలసిన మనస్తత్వం గురించి అనుకున్నాము. మనకు కూడా - ఉద్యోగాల కోసం, వేరే ఉపాధుల కోసం  దేశంలో ఎక్కడికయినా వెళ్ళ గలిగే మనస్తత్వమూ, స్వాతంత్ర్యమూ రెండూ వుండాలి. వొక జోకు చెబుతారు. టెన్ సింగ్ నార్కే, ఎడ్మండ్  హిల్లరీ  ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కి - అబ్బ, అంటూ కూర్చున్నారట. అంతలో - అక్కడికి - వొక మలయాళీ అతను - చాయ్, చాయ్ - అంటూ - టీ అమ్మ వచ్చాడట. అది మలయాళీల మనః స్వాతంత్ర్యానికి ఉదాహరణగా చెబుతారు.

తెలుగు వారు వొకప్పుడు వున్న వూరు కదిలి వెళ్ళే వారు కారు. యిప్పుడిప్పుడు వెళుతున్నారు.  రైతు సమూహం తప్ప, మిగతా అందరూ - అన్ని ప్రదేశాలకూ వెళ్లి ఉండగలిగే  మానసిక స్వాతంత్ర్యం కలిగి వుండాలి.భారత దేశానికి యిది చాలా ముఖ్యం. అలాగే - అందరూ, నా వారే - అనే మనస్తత్వమూ వుండాలి. ఎక్కడో పుట్టిన మదర్  థెరెసా కున్న భావం మనలో కూడా వుండాలి కదా.

పైనున్న మ్యాపు అలాగే వుంటుందా , మారిపోతుందా?  ఎప్పుడు?

ఏమో. నాకు తెలీదు. కానీ - ఖమ్మం  పక్కన  తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి అలాగే వుంటాయి. నల్గొండ ప్రక్కన - కృష్ణా, గుంటూరు లు అలాగే వుంటాయి. మహబూబ్ నగర్ ప్రక్కన కర్నూలు, ప్రకాశంలు అలాగే వుంటాయి. దేవుడు పెట్టినవి, ఏవీ, ఎక్కడికీ మారవు. అక్కడి గాలి ఇక్కడికీ, యిక్కడి వానలు అక్కడికీ పోతూనే వుంటాయి. రాజకీయ వాదులు మరీ స్వార్థపరులు కాకుంటే - నదులు మహారాష్ట్రలో పుట్టినా, కర్నాటకాకు, అక్కడి నుండి తెలంగాణా ప్రాంతం ద్వారా కోస్తాకూ - అక్కడి నుండి బంగాళాఖాతానికీ వెళ్ళుతూనే వుంటాయి. కాళిదాసు గారు -మహా కవి కాక ముందు -  తానున్న కొమ్మను తానే నరుకుతూ ఉన్నాడట. అలా  మన నెత్తిన మనమే రాళ్ళు వేసుకునే పనులు ఎన్నైనా, ఏ రాష్ట్రం వారైనా చెయ్యొచ్చు - నదుల విషయంలో.  లేదంటే - రాష్ట్రాలు ఎన్నైనా మనమంతా వొక్కటే.

నేను ఉద్యోగ రీత్యా - దేశంలోని - దాదాపు అన్ని ప్రాంతాలలో - నివసించవలసి వచ్చింది. బెంగాల్ ,అస్సాం, కోస్తా, హైదరాబాద్, తమిళనాడు లతో సహా ఎన్నో ప్రాంతాలలో ఎన్నో సంవత్సరాలు గడిపాను. నాకు - ఆ అన్ని ప్రాంతాలూ నచ్చాయి. మనుషులూ నచ్చారు. భాషలూ నచ్చాయి. కానీ రాజకీయ వాదులు మాత్రం చాలావరకు స్వార్థ పరులు గానే వున్నారు. 

యిప్పుడు నా రాష్ట్రం ఏది? నాకు తెలీదు. నాది భారత దేశం. అంతే.


 = మీ 

  వుప్పలధడియం విజయమోహన్